విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఓ అధికారి తీరు వివాదస్పదంగా మారింది. ఆయన మాట వినని కిందిస్థాయి వైద్యులతో పాటు, రోగులు, వారి బంధువులను సైతం దూషిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు రోగులకు చికిత్స చేయాలంటే సదరు అధికారికి కుర్చీలు, బెంచీలను, లేదంటే నగదును గిఫ్ట్రూపంలో ఇవ్వాల్సిందేనట. ఆస్పత్రిలోని ఎముకల విభాగానికి చెందిన వైద్యాధికారి తీరుతో రోగులతో పాటు వైద్యులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.
గతంలో కూడా ఆ అధికారి జామి గ్రామానికి చెందిన ఓ యువకుడికి శస్త్రచికిత్స చేసిన తర్వాత రెండు కుర్చీలు ఇస్తేగాని డిశ్చార్చ్ చేయనని చెప్పడంతో యువకుడి తల్లి రెండు కుర్చలు కొనుగోలు చేసి ఇచ్చారు. ఈ విషయం పత్రికల్లో రావడంతో ఆస్పత్రి అధికారులు కుర్చీలు తిరిగి ఇప్పించేశారు. కొద్దిరోజుల తర్వాత సదరు అధికారి మళ్లీ పాతపద్ధతినే కొనసాగించడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వాస్పత్రి అయితే మాత్రం ఉచితంగా ఎందుకు చికిత్స చేయాలనే భావనతో ఆపరేషన్ చేయించుకున్న ప్రతీరోగి వద్ద గిఫ్ట్, నగదు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విజయనగరానికి చెందిన ఓ న్యాయవాది తన తండ్రికి శస్త్రచికిత్స చేసినందుకు నాలుగు కుర్చీలు గిఫ్ట్ రూపంలో ఇచ్చినట్టు సమాచారం. కొద్ది రోజుల కిందట ఓ రోగితో తాను చెప్పిన మెడికల్ షాపులో రూ.30 వేలు పెట్టి ఇంప్లాంట్స్ కొనుగోలు చేయించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ వద్ద “సాక్షి’ ప్రస్తావించగా ఎముకల విభాగానికి చెందిన అధికారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించి, చర్యలు తీసుకుంటామన్నారు.


