
కొత్త నిబంధనలతో చట్టం రూపొందిస్తున్నకేంద్ర విద్యుత్ అథారిటీ
పవర్ గ్రిడ్ల రక్షణకు ప్రత్యేక సాంకేతికత
అన్ని రాష్ట్రాల్లో పవర్ ఐలాండ్ సిస్టమ్ల ఏర్పాటుకు సన్నద్ధం
దక్షిణాది గ్రిడ్కు గత ప్రభుత్వంలో అభివృద్ధి చేసిన జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సాయం
సాక్షి, అమరావతి: పవర్ గ్రిడ్లకు సైబర్ దాడుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో వాటి భద్రతకు కొత్త నిబంధనలతో ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ–సీఈఏ) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రక్రియ ఇప్పటికే కొలిక్కి వచ్చిందని, తుది మెరుగులు దిద్ది త్వరలోనే చట్టాన్ని తీసుకువస్తామని వెల్లడించింది. కొంతకాలం క్రితం దేశ ఆరి్థక రాజధాని ముంబైలో పవర్ గ్రిడ్ పనితీరులో అంతరాలను సైబర్ నిపుణులు గుర్తించారు.
ఈ నేపథ్యంలోనే విద్యుత్ వ్యవస్థను సైబర్ దాడుల నుంచి కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్రం భావించింది. సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్(సీఎస్ఐఆర్టీ)ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సీఈఏ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేటు సంస్ధల్లో శిక్షణ పొందిన సైబర్ (ఇంటర్నెట్) నిపుణులు ఈ బృందంలో ఉంటారు. ఇటువంటి నిర్ణయాలకు చట్టబద్ధత కల్పిస్తూ సీఈఏ తాజాగా విద్యుత్ రంగంలో సైబర్ సెక్యూరిటీపై కొత్త నిబంధనలను తీసుకువస్తోంది.
ఇవీ నిబంధనలు
దేశంలో నార్తరన్, వెస్ట్రన్, సదరన్, ఈస్ట్రన్, నార్త్ ఈస్ట్రన్ అనే ఐదు ప్రాంతీయ పవర్ గ్రిడ్లు ఉన్నాయి. వీటన్నిటినీ ‘ఒన్ నేషన్.. ఒన్ గ్రిడ్’ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ గ్రిడ్కు అనుసంధానించారు. వీటి కార్యకలాపాలన్నీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిధిలో జరుగుతుంటాయి. ఇంత పెద్ద గ్రిడ్కు సంబంధించిన సమాచార వ్యవస్థను శత్రువులు చేజిక్కించుకుంటే దేశం మొత్తం చీకటైపోతుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఈ నేపథ్యంలో పవర్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాలపై సైబర్, ఉగ్ర దాడులను ఎదుర్కోవటానికి పవర్ ఐలాండ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని సీఈఏ ప్రతిపాదించింది.
ఇది విద్యుత్ వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. గ్రిడ్లో ఏదైనా అంతరాయం ఏర్పడితే విద్యుత్ వ్యవస్థను వెంటనే దానినుంచి వేరు చేయడాన్ని పవర్ ఐలాండింగ్ సిస్టమ్ అంటారు. దీనివల్ల పవర్ గ్రిడ్లు కుప్పకూలకుండా నియంత్రించవచ్చు. అదేవిధంగా రాష్ట్ర విద్యుత్ రంగంలో కచ్చితంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్(సీఐఎస్ఓ)ను నియమించాలి. భారత పౌరసత్వం కలిగిన సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులను సీఐఎస్ఓగా నియమించాలి. వారు సంస్థ ఉన్నతాధికారికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి.
అలాగే ప్రతి విద్యుత్ సంస్థ సైబర్ క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్(సీసీఎంపీ)ని అభివృద్ధి చేసుకోవాలి. విద్యుత్ రంగంలోని కంప్యూటర్లలో సాఫ్ట్వేర్లు హ్యాకింగ్కు గురికాకుండా అడ్వాన్స్ ఫైర్వాల్స్, డిటెక్షన్ సిస్టమ్, ప్రివెన్షన్ సిస్టమ్ను తయారు చేయాలి. ట్రస్టెడ్ వెండర్ సిస్టమ్ను కూడా కచ్చితంగా పెట్టుకోవాలి. ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ద్వారా మాల్వేర్ కంప్యూటర్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది.
వీటన్నిటిపైనా ఐటీ, టెక్నాలజీ విభాగాల్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. అలాగే విద్యుత్ సంస్థల్లో ఎక్కువ మంది సిబ్బంది విద్యుత్ కార్యకలాపాలను తమ సెల్ఫోన్ల ద్వారానే నియంత్రిస్తున్నారు. వారిని మోసగించి వారి ఫోన్లలో హానికర సాఫ్ట్వేర్ పంపి విలువైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది.
పునరుత్పాదక విద్యుత్కు ప్రత్యేక రక్షణ
దేశ విద్యుత్ అవసరాల్లో దాదాపు 40 శాతం పునరుత్పాదక ఇంధనమైన గాలి, నీరు, సౌర విద్యుత్ నుంచే సమకూరుతోంది. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ప్రాజెక్టులు సైబర్ దాడులకు గురవుతాయనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దిగుమతి చేసుకున్న విద్యుత్ సరఫరా విడి భాగాలపై సైబర్ భద్రతా చర్యలను మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది. మాల్వేర్, ట్రోజన్లు వంటి ఏదైనా సైబర్ బెదిరింపుల కోసం దిగుమతి చేసుకున్న అన్ని విద్యుత్ సరఫరా విడి భాగాలను నేరస్తులు వాడుకునే అవకాశం ఉండటంతో హానికరమైన ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఉందేమోనని తప్పనిసరిగా తనిఖీ చేయాలని స్పష్టం చేసింది.
మన రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ భద్రతకు సంబంధించి ప్రత్యేక పరిశోధన, చర్యలు చేపట్టారు. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) అనేది అప్పుడే రూపొందింది. దీనివల్ల ఏపీ ట్రాన్స్కో, డిస్కంల మొత్తం ట్రాన్స్మిషన్, డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్లను జియో ట్యాగింగ్ చేయడం తేలికైంది. దీంతో సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ) మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్ను పర్యవేక్షించడానికి ఏపీ ట్రాన్స్కో జీఐఎస్ మోడల్ను తీసుకుంది.