ఐటీ వద్దు.. సివిల్సే ముద్దు | Civils‌ Examination Procedure becoming useful for Engineering‌ candidates | Sakshi
Sakshi News home page

ఐటీ వద్దు.. సివిల్సే ముద్దు

Aug 6 2020 3:17 AM | Updated on Aug 10 2020 3:59 PM

Civils‌ Examination Procedure becoming useful for Engineering‌ candidates - Sakshi

సాక్షి, అమరావతి: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ వంటి అత్యున్నత సర్వీసు కేడర్‌ పోస్టులకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల వైపు ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన యువత ఎక్కువ దృష్టి సారిస్తోంది. గతంలో హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌లలో డిగ్రీ చేసిన వారు సివిల్స్‌కు ఎక్కువగా హాజరయ్యేవారు. బీఈ, బీటెక్‌ చేసిన వారు ఐటీ, తదితర తమ కోర్‌ గ్రూపు పోస్టుల వైపు వెళ్లేవారు. కానీ గత కొంతకాలంగా ఆర్ట్స్, సోషల్‌ సైన్సెస్‌ అభ్యర్థులతోపాటు బీఈ, బీటెక్‌ పూర్తిచేసిన వారు సివిల్స్‌వైపు మొగ్గుచూపుతుండడమే కాకుండా మంచి ఫలితాలను సాధిస్తున్నారు.

నిపుణులు ఏమంటున్నారంటే.. 
► ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌లలో పట్టు ఉండడంతో సివిల్‌ సర్వీస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
► అభ్యర్థుల్లో లాజికల్‌ రీజనింగ్, ఎనలిటికల్‌ ఎబిలిటీ, ఆంగ్ల నైపుణ్యం పరిశీలనకు సీశాట్‌ పెట్టారు. ఈ మూడింటిలోనూ ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు ఎక్కువ పరిజ్ఞానం ఉంటోంది.
► ఐటీ రంగంలో మంచి అవకాశాలు దక్కుతున్నా ప్రైవేటు రంగంలో అనిశ్చిత పరిస్థితులు, ప్రతికూల పరిణామాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, జీతాల్లో కోత తదితర కారణాలతో సివిల్స్‌ వైపు దృష్టి సారిస్తున్నారు.
► అంతేకాకుండా ఈ అభ్యర్థులు సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షల్లో తమ కోర్‌ గ్రూప్‌ సబ్జెక్టులను కాకుండా హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌ సబ్జెక్టు (ఆంత్రోపాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, హిస్టరీ తదితర)లను ఎంచుకుని విజయం సాధిస్తున్నారు. 
► జేఈఈ మెయిన్స్, అడ్వాన్సులతోపాటు బిట్స్‌ పిలానీ వంటి వాటి ప్రవేశ పరీక్షల్లో విజయం సాధించిన అనుభవం సివిల్స్‌ సన్నద్ధతకు బాగా ఉపయుక్తంగా ఉంటోంది. 
► 2011 నుంచి ఇప్పటివరకు జరిగిన సివిల్స్‌ పరీక్షల ఫలితాల్లో 70 శాతానికి పైగా ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన వారే ఉన్నారని.. తమ సంస్థ నుంచి 10 మంది ఎంపికయ్యారని సివిల్స్‌ శిక్షణ సంస్థ మెంటార్‌ ఒకరు వివరించారు.
► సివిల్స్‌–2019లో విజయం సాధించిన మొత్తం 829 మందిలో కూడా ఇంజనీరింగ్‌ అభ్యర్థులే అత్యధికమని విశ్లేషిస్తున్నారు.
► ఇక తెలుగు రాష్ట్రాల నుంచి విజయం సాధించిన అభ్యర్థులలో కూడా 90 శాతం మంది వీరేనని పేర్కొంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement