విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఐటీయూ ధర్నా | Visakha Steel Plant Privatization, CITU Stages Protest And Demands Judicial Probe Into Fatal Accidents | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఐటీయూ ధర్నా

Jul 3 2026 2:36 PM | Updated on Jul 3 2026 3:00 PM

Citu protest against vizag steel plant privatization

సాక్షి,విజయవాడ:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ, కార్మికుల హక్కుల రక్షణే ధ్యేయంగా విజయవాడలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సి.హెచ్. నర్సింగరావుతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరంచేసే కుట్రలో భాగంగానే అక్కడ భద్రతను గాలికొదిలేశారని నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ధర్నాను ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సి.హెచ్. నర్సింగరావు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత నెలలో జరిగిన ఘోర ప్రమాదంలో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారని గుర్తుచేశారు. ఈ వరుస ప్రమాదాలకు ప్రభుత్వ విధానాలే కారణమని, దీనికి పూర్తి బాధ్యత స్టీల్ సెక్రటరీదేనని ఆయన స్పష్టం చేశారు.

ప్రమాదాలపై తక్షణమే ఉన్నత స్థాయి న్యాయవిచారణ జరిపించాలని, స్టీల్ సెక్రటరీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ప్లాంట్‌లో కార్మికులను పొమ్మనలేక పొగబెడుతున్నారని నర్సింగరావు విమర్శించారు. ఇప్పటికే 12 వేల మంది కార్మికులను అక్రమంగా తొలగించారని, భద్రతా విభాగంలో 50 మంది పనిచేయాల్సిన చోట ప్రస్తుతం కేవలం 18 మంది మాత్రమే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో ప్రతి డిపార్ట్‌మెంట్‌కు ఒక భద్రతా అధికారి ఉండేవారని, కానీ ఇప్పుడు మూడు షిఫ్ట్‌లకు కలిపి ముగ్గురే ఉన్నారని తెలిపారు. నాణ్యత లేని ముడిసరుకు వాడటం, ఆపరేటింగ్ ప్రొసీజర్‌లో సరైన సమయం పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. జూన్ 5వ తేదీ నుంచి ఇన్ స్ట్రుమెంటేషన్ విభాగం పనిచేయడం లేదని, ఏ డిపార్ట్‌మెంట్‌లో ఏం జరుగుతుందో కూడా తెలియని దారుణ పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. 

గతంలో ఎల్‌జీ పాలిమర్స్ ప్రమాద సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించారని నర్సింగరావు గుర్తుచేశారు. మరి ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ మృతులకు చంద్రబాబు ప్రభుత్వం కేవలం 25 లక్షల రూపాయలే ఎందుకు ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు.

 వివక్ష చూపకుండా స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు కూడా కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్లాంట్‌లో భద్రత విషయంలో రాజీపడటమంటే దేశద్రోహంతో సమానమని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే వరకు తమ పోరాటం ఆగేది లేదని సిఐటియు నేతలు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement