వైద్యశాఖలో నలుగురే ఐఏఎస్లు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యంపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులతో పరుగులు పెట్టిన వైద్య శాఖను ప్రస్తుతం ఐఏఎస్ల కొరత వేధిస్తోంది. ఇప్పుడీ శాఖను కేవలం నలుగురు ఐఏఎస్లతోనే పరిమితం చేశారు. నలుగురిలో ఒకరైన జాయింట్ సెక్రటరీ రోణంకి గోపాలకృష్ణ సోమవారం నుంచి జూన్ 6 వరకు లాల్బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో శిక్షణకు వెళ్తున్నారు. దీంతో ఆయన నిర్వర్తిస్తున్న ఆయుష్ కమిషనర్, ఏపీ శ్యాక్స్ పీడీ బాధ్యతలను ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వీరపాండియన్కు ఎఫ్ఏసీ ఇస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఇప్పటికే ఆరోగ్య శాఖ కమిషనర్, ఐపీఎం కమిషనర్, డైరెక్టర్, ఎన్హెచ్ఎం డైరెక్టర్ బాధ్యతలను వీరపాండియన్ నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు అదనంగా మరో రెండు శాఖలను కేటాయించారు. మరోవైపు ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ, ఆరోగ్యశ్రీ, ఔషధ నియంత్రణ డీజీ స్థానాల్లో పూర్తి స్థాయి అధికారులు లేరు. గత కొద్ది నెలలుగా ఇన్చార్జులే దిక్కయ్యారు. ఉన్న కొందరు ఐఏఎస్లకే రెండు, మూడు విభాగాల బాధ్యతలు ఇవ్వడంతో పర్యవేక్షణ లోపించి గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.


