సాక్షి, అమరావతి/కాకినాడ రూరల్: మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు గురువారం రాత్రి అక్రమ కేసు నమోదు చేశారు. తప్పుడు, రెచ్చగొట్టే ప్రకటనలను ప్రసారం చేసి.. వ్యాప్తికి కారణమైన వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని కాకినాడ అర్బన్ జయేంద్ర నగర్కు చెందిన నల్లం శ్రీరాములు ఫిర్యాదు చేశారు.
ఈ నెల 19న ఒక చానల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ నిర్వహించిన ప్రత్యక్ష చర్చలో హోం మంత్రి అమిత్ షా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్పై ఆధా రాలు లేకుండా మాట్లాడారని, అవి ఇతర మీడియా వేదికలపై ప్రముఖంగా వచ్చాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. 'సాక్షి' మీడియా నిర్వహించిన చర్చల్లో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు పాల్గొని కూటమి రాజకీయ పరిణామాలు, సున్నితమైన అంశాలను ప్రసారం చేసి ప్రజల్లో గందరగోళం ఏర్పడేలా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సీహెచ్ ప్రకాష్, ఎస్ఐఐ కె.ఏసుబాబు తెలిపారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లపై అవాస్తవాలు, అబద్దాలు ప్రచారం చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్, ఈ వ్యాఖ్యలు ప్రసారం చేసిన 99 టీవీ యాజమాన్యం, చర్చ నడిపిన జర్నలిస్టుపై చర్యలు తీసుకోవాలని కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో జనసేన నాయకుడు శిరంగు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు గురువారం రాత్రి కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎం.వీరబాబు తెలిపారు. జనసేన పార్టీ పైన, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన, పార్టీ నాయకులపైన అవాస్తవాలు, నిందారోపణలు చేసినా ఇకపై తక్షణం పోలీసు కేసులు పెట్టడంతోపాటు న్యాయ పరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు జనసేన పార్టీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.


