సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం జరిగింది. గుత్తి వద్ద కేకే ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. బోల్తాపడింది.
ఆంధ్రప్రదేశ్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల నక్కపల్లి జాతీయపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, తిరుపతి జిల్లాలో ప్రైవేట్ బస్సుకు తృటిలో ఘోర ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పూతలపట్టు –నాయుడుపేట ప్రధాన రహదారిలోని పాకాల మండలం నేండ్రగుంట సమీపంలో ఘటన జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తుండగా ఘటన జరిగింది.


