ఇంటర్‌లో 61% ఉత్తీర్ణత

Botsa Satyanarayana Released Inter Exam Results Andhra Pradesh - Sakshi

ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ

ఫస్ట్‌ ఇయర్లో 4,45,604 మందికి 2,41,591 మంది.. సెకండ్‌ ఇయర్లో 4,23,455కి 2,58,449 మంది పాస్‌ 

బాలికలదే పైచేయి

72 శాతంతో కృష్ణా జిల్లా ఫస్ట్‌ 

ఆగస్టు 3 నుంచి 12 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌– 2022 సెకండియర్‌ పరీక్ష ఫలితాల్లో 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. విజయవాడలో బుధవారం ఈ పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. పరీక్షలు పూర్తయిన 28 రోజుల్లోనే ఇంటర్మీడియట్‌ బోర్డు ఈ ఫలి తాలను ప్రకటించింది. ఇంటర్‌ పరీక్షలు రాసిన మొత్తం 9,41,358 మందిలో రెగ్యులర్‌ స్ట్రీమ్‌ విద్యార్థులు 8,69,059 మంది, వొకేష నల్‌ విద్యార్థులు 72,299 మంది ఉన్నారు.

రెగ్యులర్‌ స్ట్రీమ్‌లో ఫస్టియర్‌లో 4,45,604 మందికిగాను 2,41,591 (54 శాతం) మంది, సెకండియర్లో 4,23,455 మందికిగాను 2,58,449 (61 శాతం) మంది ఉత్తీర్ణుల య్యారు. ఈసారి ఫలితాల్లో బాలురకన్నా బాలికలు ఎక్కువమంది పాసయ్యారు. ఫస్టియర్లో బాలురు 49 శాతం, బాలికలు 60 శాతం మంది, సెకండియర్లో బాలురు 54 శా తం, బాలికలు 68 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ వొకేషనల్‌ పరీక్షల్లో ఫస్టియర్లో 45 శాతం, సెకండియర్లో 55 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 

కృష్ణాజిల్లా టాప్‌
ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్‌ ఫలితాల్లో విద్యార్థుల ఉత్తీర్ణతలో కృష్ణాజిల్లా అగ్రస్థానంలో నిలిచింది. సెకండియర్లో 72 శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా మొదటిస్థానంలో ఉండగా 50 శాతం ఉత్తీర్ణత తో వైఎస్సార్‌ జిల్లా చివరిస్థానంలో ఉంది. సెకండియర్లో కృష్ణాలో బాలురు 66 శాతం, బాలికలు 72 శాతం మంది, వైఎస్సార్‌ జిల్లాలో బాలురు 34 శాతం, బాలికలు 47 శాతం మంది పాసయ్యారు. 

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీకి ఫీజు చెల్లింపు గడువు జూలై 8 
ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు తొలిసెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌ కింద ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

ఫెయిలైన వారితోపాటు ప్రస్తుతం పాసైన విద్యార్థులు మార్కుల ఇంప్రూవ్‌మెంటుకోసం కూడా ఈ పరీక్షలకు దరఖాస్తు చేయవచ్చని చెప్పారు. ప్రాక్టి కల్స్‌ ఆగస్టు 17 నుంచి 22 వరకు జరుగు తాయన్నారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజును ఈనెల 25 నుంచి జూలై 8వ తేదీ లోగా చెల్లించాలని చెప్పారు. ప్రస్తుత ఫలితాలకు సంబంధించి మార్కుల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఈనెల 25 నుంచి జూలై 5వ తేదీవరకు దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. ఫెయిలైన ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నామన్నారు.

ఇవి ప్రమాణాలతో కూడిన ఫలితాలు
గతంలోకన్నా ఈసారి ఇంటర్మీడియట్లో ప్రమాణాలతో కూడిన ఫలితాలు వచ్చినట్లు మంత్రి బొత్స చెప్పారు. విద్యార్థులు  చూపిన ప్రతిభ మేరకు ఫలితాల శాతాలు ఉంటాయన్నారు. మాస్‌కాపీయింగ్‌ చేయిస్తే ఉత్తీర్ణత శాతాలు పెరుగుతాయని, కానీ అవి ప్రమాణాలతో కూడిన ఫలితాలు కావని చెప్పారు. ఈ సందర్భంగా 2017 నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షల ఉత్తీర్ణత శాతాలను మంత్రి వివరించారు.

విద్యార్థులు ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను నేర్చుకునేలా విద్యాసంస్థల్లో తగిన వాతావరణాన్ని తమ ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. ప్రభుత్వ చర్యల వల్ల ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరికలు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. గతంలో ప్రభుత్వంలో 38 శాతం, ప్రైవేటులో 65 శాతం మంది విద్యార్థులుంటే.. ఇప్పుడు ప్రభుత్వంలో 60 శాతం, ప్రైవేటులో 40 శాతం మంది విద్యార్థులున్నారని చెప్పారు.

చంద్రబాబులా డబ్బాలు కొట్టుకోవడం కాకుండా విద్యాసంస్థల్లో అభివృద్ధి పనులు చేస్తున్నందునే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నారని వివరించారు. ముందుగా టెట్‌ నిర్వహించి అనంతరం అవసరం మేరకు డీఎస్సీని కూడా పెడతామని ఆయన చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top