సాక్షి, అమరావతి: న్యాయబద్ధంగా తమకు దక్కాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు తక్షణమే మంజూరు చేయాలని, ఉద్యోగుల నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేసే ప్రక్రియకు స్వస్తి పలకాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది.
సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11, 12 తేదీల్లో ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ‘సచివాలయ ఉద్యోగుల ఆవేదన’ పేరిట జేఏసీ చైర్మన్ బూరాడ మధుబాబు రెండు రోజుల నిరాహార దీక్ష చేయనున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు.


