
రాష్ట్రవ్యాప్తంగా 137.. రాష్ట్రం వెలుపల 17 కేంద్రాల్లో పరీక్షలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగా ల భర్తీకి నిర్వహించే డీఎస్సీ–2025 పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 44 దశల్లో ఈనెల 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9, మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్షలు రెండు విడతల్లో జరుగుతాయి. పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందు నుంచే కేంద్రాల్లోకి ప్రవేశం ఉంటుంది. మొత్తం 16,437 పోస్టులకు 3,36,305 మంది 5,77,675 దరఖాస్తులు చేసుకున్నారని కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.
సీబీటీ విధానంలో జరిగే పరీక్షల కోసం రాష్ట్రంలో 137 పరీక్ష కేంద్రాలు, రాష్ట్రం వెలుపల హైదరాబాద్, కోదాడ, చెన్నై, బెంగళూరు, బెర్హంపూర్లో మరో 17 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొదటి ప్రాధాన్యత క్రమంలో 87.8 శాతం మందికి వారి జిల్లాల్లోనే కేంద్రాలు కేటాయించారు. అన్ని కేంద్రాల్లోనూ సీసీటీవీలు ఏర్పాటు చేశారు. సందేహాల నివృత్తి కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని, ఏమైనా ఫిర్యాదులుంటే 6281704160, 8121947387, 8125046997, 9398810958, 7995649286, 7995789286 9963069286, 7013837359 నంబర్లలో సంప్రదించాలని కన్వీనర్ కృష్ణారెడ్డి సూచించారు.