ప్రజలకు సేవ చేసేందుకే సేవకుడిగా ఇక్కడికి వచ్చాను: సీఎం జగన్‌ | Ap: Jaganannaku Chebudam Program Live Updates | Sakshi
Sakshi News home page

Jaganannaku Chebudam: ప్రజలకు సేవ చేసేందుకే సేవకుడిగా ఇక్కడికి వచ్చాను: సీఎం జగన్‌

May 9 2023 11:27 AM | Updated on May 9 2023 1:50 PM

Ap: Jaganannaku Chebudam Program Live Updates - Sakshi

Live Updates:

సంతృప్త స్థాయిలో విన­తుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించే ఉద్దేశంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శ్రీకారం చుట్టారు. క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. 

‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో సీఎం జగన్‌ స్పీచ్‌

అర్హత ఉన్నా.. రాని పరిస్థితులు ఉన్నా, 
న్యాయం మీ వైపున ఉన్నా.. జరగని పరిస్థితులు ఉన్నా…, 
ఇంతకుముందు ప్రయత్నం చేసినా.. మీ ప్రయత్నం సత్ఫలితం ఇవ్వని పరిస్థితుల్లో…
ప్రభుత్వ సేవలకు సంబంధించి ఇలాంటి వ్యక్తిగత సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారం చూపేలా తపన, తాపత్రయంతో పుట్టకొచ్చిన మరొక మెరుగైన ఆలోచన నేరుగా మీ జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని తీసుకు వచ్చాం
-ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

►జగనన్నకు చెబుదాం కార్యక్రమం మిగతా కార్యక్రమాలకంటే భిన్నమైనది.
►ప్రతి సమస్యలకూ పరిష్కారం చూపాలని నాలుగు సంవత్సరాలుగా మన పరిపాలన సాగింది.
►3648 కి.మీ సాగిన నా పాదయాత్రలో ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాల్లో… నాకు కనిపించిన సమస్యలకు పరిష్కారం వెతికే క్రమంలో అడుగులు వేస్తూ ఈ నాలుగేళ్లుగా ముందుకు సాగాం.

►చాలావరకు సమస్యలు అన్నీ కూడా మానవ తప్పిదాలే.
►ప్రభుత్వం పలకాల్సిన పరిస్థితుల్లో పలికితే, ప్రభుత్వం న్యాయంగా, ధర్మంగా ఉంటే… ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం అవుతాయని పాదయాత్రలో కనిపించింది.
►ఈ పద్ధతిలో ప్రభుత్వం లేకపోతే 90 నుంచి 95శాతం సమస్యలు వస్తాయి.
►పింఛన్లు రాలేదని పాదయాత్రలో నా దగ్గరకు వచ్చేవారు.
►జన్మభూమి కమిటీలు చెప్తేకాని.. ఇవ్వని పరిస్థితి ఆనాటిది.
►మీరు ఏ పార్టీకి సంబంధించన వారని వాళ్లు అడిగేవారు.
►అంతేకాక ప్రతి పనికీ కూడా నాకెంత ఇస్తావు అని అడిగే గుణం.
►పెన్షన్ల దగ్గర నుంచి చూస్తే.. ఇళ్లకేటాయింపులు వరకూ ఇదే పరిస్థితి.
►ఏ ప్రభుత్వ పథకం తీసుకున్నా.. ప్రతి అడుగులోనూ వివక్ష, లంచాలు కనిపించేవి.
►మేం ఇవ్వగలిగింది ఇంతే.. ఊర్లో ఇంతమందికే ఇస్తామని చెప్పేవారు.
►ఎవరైనా సరే తప్పుకుంటేనే, చనిపోతేనే మిగతావాళ్లకి వచ్చే పరిస్థితి.

►నా సుదీర్ఘ పాదయాత్రలో ఇవన్నీ చూశాం.
►అర్హత ఉన్నవాళ్లు ఎంతమంది ఉంటే.. అంతమందికి ఇవ్వడం, తన పార్టీ, వేరే పార్టీని చూడకుండా ఇవ్వడం, వివక్ష లేకుండా ఇవ్వడం, లంచాలు లేకుండా ఇవ్వడం, సంతృప్తి స్థాయిలో ఇవ్వడం, గ్రామస్థాయిలో ఇవ్వగలిగితే.. అన్ని పరిష్కారాలూ దొరుకుతాయని పరిపాలనలో మార్పులు తీసుకు వచ్చాం.
►గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం.
►వ్యవస్థల్లోకి లంచాలు, వివక్షలేని గొప్ప మార్పులను తీసుకు వచ్చాం.
►రైతు భరోసాకేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్‌, ఫ్యామిలీ డాక్టర్‌, ఆస్పత్రుళ్లలో వైద్యసేవలు, పిల్లలు చదువుతున్న స్కూళ్లు, ఇతరత్రామనం ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి ప్రజలకు మరింత చేరువగా పరిపాలనను తీసుకువచ్చేలా ఈ నాలుగేళ్లలో అడుగులు పడ్డాయి.

►దేశంలో కూడా ఎక్కడా జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా మార్పులు తీసుకువచ్చాం.
►ఇందులో భాగంగా ఇప్పటికే స్పందన అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చాం.
►గ్రామ సచివాలయాలనుంచి కలెక్టర్ల వరకూ ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యారు.
►దీనికోసం ఒక యంత్రాంగాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చాం.
►ప్రజలకు హక్కుగా అందాల్సిన సేవలను బాధ్యతగా అందించేలా, ఎలాంటి జాప్యంలేకుండా చూడగలిగాం.
►న్యాయం, ధర్మం ఉండి వారికి రావాల్సింది వారికి రాకపోతే ఎలాంటి బాధ అనుభవిస్తారో తెలిసిన ప్రభుత్వంగా అడుగులు ముందుకు వేశాం.
►సమస్యలకు పరిష్కారాలు చూపించేలా స్పందన ద్వారా అడుగులు వేశాం.

►ఇవాళ దానికి మరింత మెరుగ్గా చేయాలనే ఉద్దేశంతో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.
►మారుమూల గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకూ అన్ని స్థాయిల్లో అందర్నీ భాగస్వాములను చేస్తున్నాం.
►జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం ద్వారా కొన్ని మెరుగులు తీసుకువచ్చాం.
►సమస్యకు పరిష్కారం చూపించేటప్పుడు అర్జీదారుకి సంతోషాన్ని కలిగించేలా, ఆ మనిషి ముఖంలో చిరునవ్వులు చిందించాలన్న తపన, తాపత్రయంతో ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దాం.
►నాణ్యతతో సమస్యల పరిష్కారానికి వేదిక ఇది.
►ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత సమస్యలకు మెరుగైన పరిష్కాం చూపించడానికి వేదిక ఇది.
►మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న వ్యవస్థలద్వారా గట్టిగా ప్రయత్నం చేయడం.
►ఇలా చేసిన తర్వాత కూడా మనవైపు న్యాయం ఉండి న్యాయం జరగని పరిస్థితి ఉన్నా, అర్హత ఉన్నా కూడా రాని పరిస్థితులు ఉన్నా, ప్రయత్నం చేసినా కూడా ►సత్ఫలితం రాని పరిస్థితులు ఉన్నా.. అప్పుడు జగనన్నకు చెబుదాం అనే ఈ కార్యక్రమం ఉపయోగపడేలా నేరుగా జగనన్నకే చెబుదాం అన్నది ఈ కార్యక్రమం సారాంశం.

►అర్హత ఉన్న ప్రభుత్వ సేవలు అందకపోయినా, పథకాలు అందకపోయినా, ఆరోగ్యశ్రీ, పెన్షన్‌ కానుక, భూమి రికార్డులు ఇలా ఎలాంటి సేవ అయినా.. మన ప్రయత్నంచేసినప్పటికీ కూడా మనకు ఫలితాలు రాని పక్షంలో నేరుగా మీ జగన్‌కు, మీ అన్నకే, మీ తమ్ముడికే, మీ ఇంట్లో మీ బిడ్డకే ఫోన్‌ కొట్టండి.
►1902కు ఫోన్‌ కొడితే… నేరుగా సీఎంఓకే ఫోన్‌ వస్తుంది.
►పరిష్కారం ఈ స్థాయిలో చూపించే గొప్ప ఆలోచనకు అడుగులు వేస్తున్నాం.
►మీరు ప్రయత్నంచేసినా పరిష్కారం కాని సమస్యలు నేరుగా నా దృష్టికే వస్తాయి.
►కాల్‌చేశాక మీకు ఒక వైయస్సార్‌ రిఫరెన్స్‌ ఐడీ నంబర్‌ వస్తుంది.
►మీ ఫిర్యాదుకు అంత గౌరవం ఇస్తూ వైయస్సార్‌ పేరు పెట్టాం.
►మీ సమస్యను నా సమస్యగా భావించి.. దాన్ని ట్రాక్‌ చేస్తాం.
►నేరుగా సీఎంఓనే దీన్ని ట్రాక్‌ చేస్తుంది.

►ప్రతి అడుగులోకూడా ఎస్‌ఎంఎస్‌ద్వారా, ఐవీఆర్‌ఎస్‌ద్వారా మీ ఫిర్యాదు పరిష్కారంపై ఎప్పటికప్పుడు మెసేజ్‌లు, సందేశాలు వస్తాయి. లేదా నేరుగా కూడా చూడవచ్చు.
►మండలాలు, జిల్లాలు, రాష్ట్ర సచివాలయాల్లో, సీఎంఓలో ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లు పెట్టాం.
►సీఎంఓ, సీఎస్‌, డీజేపీ.. ముగ్గురుకూడా సమీక్షలు చేసి.. ఈ కార్యక్రమాన్ని ముందుకు బలంగా నడుపుతారు:.
►ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లలో ప్రతి చోటా కూడా మీ సమస్య పరిష్కారాన్ని మానిటరింగ్‌ చేస్తారు. సొల్యూన్‌ ఇచ్చేలా అడుగులు ముందుకు వేస్తారు.
►సమస్య పరిష్కారం అయ్యాక… మీకు ఫోన్‌చేసి.. మీ ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటారు.
►జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఇవన్నీకూడా జరుగుతాయి:
►వీటన్నింటి ద్వారా ప్రజలకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను:
►ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నా దగ్గరనుంచి మొదలుపెడితే… అంతా ప్రజలకు సేవలకు అందించడానికే ఉన్నాం.
►కేవలం అధికారాన్ని చెలాయించడానికి కాదు.
►సచివాలయంలోని అధికారి నుంచి వాలంటీర్‌ వరకూ కూడా ప్రజలకు సేవకులమే.
►ప్రజల ముఖంలో చిరునువ్వులకోసమే.
►ఈ ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం. 
►భాగస్వాములైన అధికారులందరికీ కూడా కోరేది ఒక్కటే.. అంతా కూడా కలిసికట్టుగా ఒక్కటై ప్రతి ముఖంలో కూడా చిరునవ్వులు చూడాలి.
►ప్రభుత్వ ప్రతిష్టను ఇంకా పెంచేలా, సమర్థతను మరింత పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది.
►జిల్లాలకు సీనియర్‌ అధికారులను స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమించాం.
►క్రమం తప్పకుండా వీరు జిల్లాలకు వస్తారు.
►జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేలా చూస్తారు.


జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లకు ఆహ్వానం
జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల పరిషత్‌ కార్యాలయాలతో పాటు గ్రామ సచివాలయాలు / రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని జడ్పీ సీఈవోలు, డీపీవోలకు పంచాయతీరాజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. స్థానిక జడ్పీటీసీకి ఈ సమాచారాన్ని అందచేయడంతోపాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని పేర్కొంది. గ్రామ సచివాలయాల్లో నిర్వహించే కార్యక్రమానికి స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలను ఆహ్వానించాలని సూచించింది.

జగనన్నకు చెబుదాం కార్యక్రమం లక్ష్యాలివే..
► ప్రతి వినతి పరిష్కారం అయ్యే వరకూ ట్రాకింగ్‌
► సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్ధాయిలో మీకు ఎదురయ్యే మీ సమస్యలకు మరింత మెరుగైన, నాణ్యమైన పరిష్కారం చూపాలన్న  తపనతో జగనన్నకు చెబుదాం
► వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకోవడంలో మీకు ఏమైనా ఇబ్బందులున్నా వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక అందుకోవడంలో ఏమైనా సమస్యలు ఉన్నా, రేషన్‌ కార్డు వంటివి పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైనా  రైతన్నలకైనా, అక్కచెల్లెమ్మలకైనా, అవ్వాతాతలకైనా, మరెవరికైనా ప్రభుత్వ సేవలు పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైనా
► వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సేవలు అందుకోవడంలో ఏమైనా సమస్యలున్నా
► రెవెన్యూ రికార్డులకు సంబంధించి ఏమైనా సమస్యలున్నా
► ప్రభుత్వ సేవలకు సంబంధించి మరే ఇతర వ్యక్తిగత ఇబ్బందులున్నా
► ప్రభుత్వ సేవలకు సంబంధించి ఇలాంటి ఏ సమస్య పరిష్కారానికైనా జగనన్నకు చెబుదాం – 1902 

మీ సమస్యకు పరిష్కారం ఎలా జరుగుతుందంటే..
1. మీ సమస్యను తెలియచేసేందుకు తొలుత 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేయాలి
2. కాల్‌ సెంటర్‌ ప్రతినిధికి మీ సమస్యను చెప్పండి
3. మీ ఫిర్యాదును నమోదు చేసుకుని వైఎస్సార్‌ (యువర్‌ సర్వీస్‌ రిక్వెస్ట్‌) ఐడీని కేటాయిస్తారు
4. మీ అర్జీ స్టేటస్‌ గురించి ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌ ద్వారా అప్‌డేట్‌ అందుతుంది
5. సమస్య పరిష్కారం తర్వాత ప్రభుత్వ సేవలపై మీ అభిప్రాయాన్ని పంచుకోండి

Advertisement
 
Advertisement
Advertisement