వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా కుమార్తె అన్షుమాలిక అరుదైన ఘనత సాధించారు. తన ప్రతిభతో అమెరికాలో కీర్తిపతాకాన్ని ఎగురవేశారు. అమెరికాలోని ‘హెర్మన్ బి వెల్స్ డిస్టింగ్విష్డ్ సీనియర్’ అవార్డు అందుకున్న తొలి భారతీయ విద్యార్థినిగా ఖ్యాతి గడించారు.
బ్లూమింగ్ టన్ ఇండియానా యూనివర్సిటీలో అన్షుమాలిక కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఇందు లో ఐదేళ్లకొకసారి ప్రెసిడెంట్ హెర్మన్ బివెల్స్ గౌరవా ర్థం ప్రతిష్టాత్మకమైన ‘హెర్మన్ బివెల్స్ డిస్టింగ్విష్డ్ సీనియర్’ అవార్డు అందిస్తుంది. అలాంటి అత్యున్నత పురస్కారాన్ని శనివారం తల్లిదండ్రులు ఆర్కే రోజా, ఆరేకే సెల్వమణి సమక్షంలో అన్షుమాలిక అందుకుంది. అమెరికాలో ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ విద్యార్థిని అన్షుమాలిక కావడం విశేషం.

యూనివర్సిటీలో గౌరవ ప్రదర్శనగా ఉంచే బోర్డులో ఉత్తమ విద్యార్థినిగా ఆమె పేరు లిఖించిన బంగారు ఫలకం జీవితకాలం ఉండిపోతుంది.
అవార్డులు.. పురస్కారాలు
అంతర్జాతీయ స్థాయిలో విశిష్టమైన అవార్డులు అందుకుంటూ అన్షుమాలిక తన ప్రతిభను చాటుతోంది. ఇప్పటికే ‘యూనివర్సిటీ అవుట్స్టాండింగ్ లీడర్ష్ప్ అవార్డు’ అందుకుంది. ‘ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్’ నవల ను రచించి దక్షిణ భారతదేశంలో ఉత్తమ రచయిత్రిగా గుర్తింపు పొందింది. నైజీరియాలో జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ ఫెస్టివల్లో సోషల్ ఇంపాక్ట్ విభాగంలో ‘గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్స్ అవార్డు, ‘మౌరిన్ బిగ్గర్స్ అవార్డును కూడా అందుకుంది. ప్రస్తుతం అందుకున్న అవార్డుతో మరో మైలురాయిని చేరుకుంది. సామాజిక మాధ్యమాల్లో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.



