ఇతర శాఖల్లో డెప్యుటేషన్లు వెంటనే రద్దు చేయాలి
స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కమిటీ
సాక్షి, అమరావతి: ‘‘స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు శాఖలో పని చేస్తున్న వారు ప్రభుత్వ ఉద్యోగులా లేక రోజుకూలీలా?’’ అంటూ స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు ఉద్యోగుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర శాఖల్లో వేసిన డెప్యుటేషన్లు వెంటనే రద్దు చేసి, అర్హతలను బట్టి ఉద్యోగులను సరైన ప్రాతిపదికన ఆయా శాఖల్లో విలీనం చేయాలని డిమాండ్ చేసింది. ఉద్యోగులకు పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరింది. రేషనలైజేషన్ పేరుతో పనిభారం పెంచే ప్రక్రియ వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది.
ఒకే జీతంతో రెండు పనులు చేయించడం అన్యాయమైన చర్యగా పేర్కొంది. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులకు స్పష్టమైన ప్రమోషన్ ఛానల్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలోని వార్డు సచివాలయాల్లో ఆరు విభాగాల ఉద్యోగుల్లో ఒక్కరికీ పదోన్నతి కల్పించకుండా తాత్సారం చేయడం అన్యాయమని మండిపడింది., ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ జాని పాషా, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.


