కోర్టుకే అబద్ధాలు చెబుతారా? | Andhra Pradesh High Court Fires on AP Police | Sakshi
Sakshi News home page

కోర్టుకే అబద్ధాలు చెబుతారా?

May 6 2025 6:12 AM | Updated on May 6 2025 10:32 AM

Andhra Pradesh High Court Fires on AP Police

మా ముందు ఉంచిన అఫిడవిట్లన్నీ తప్పుడువే పోలీసులపై హైకోర్టు ధర్మాసనం మండిపాటు

వివరణ ఇవ్వండి.. అన్నీ తేలుస్తామని వ్యాఖ్య.. ఈ మొత్తం వ్యవహారంలో తుది విచారణ జరుపుతాం

ఆలోపు పోలీసులు ఏమైనా చేయొచ్చు.. సీసీ ఫుటేజీ హార్డ్‌డిస్క్‌ను సీల్డ్‌ కవర్‌లో భద్రపరచండి

తదుపరి విచారణ జూన్‌ 17కి వాయిదా

సోషల్‌ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్భంధం కేసు

తాజాగా సీసీ టీవీ ఫుటేజీలో అడ్డంగా దొరికిన పోలీసులు.. నవంబర్‌ 8వ తేదీనే రవీంద్రరెడ్డిని అదుపులోకి తీసుకున్న వైనం

కానీ, 10న అదుపులోకి తీసుకున్నట్లు హైకోర్టుకు అఫిడవిట్లు.. 

సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి వాస్తవాలు తేల్చిన కోర్టు

సాక్షి, అమరావతి: ‘‘మాకే అబద్ధాలు చెబు­తారా? కోర్టు ముందు ఉంచిన అఫిడవిట్ల­న్నీ తప్పుడు­వే. దీనిపై వివరణ ఇవ్వండి. ఈ మొత్తం వ్యవహారంలో తుది విచార­ణ జరుపుతాం. అప్పుడు అన్నీ తేలుస్తాం’’ అని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధంపై వ్యాజ్యం దాఖలై ఐదు నెలలు అవుతోందని, అందు­వల్ల తుది విచారణ జరుపుతామని పేర్కొంది. రవీంద్రరెడ్డిని గత ఏడాది నవంబరు 8వ తేదీనే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సీసీ టీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించడంతో పోలీసుల తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ విషయంలో కోర్టుకు  పోలీసులు తప్పుడు అఫిడవిట్లు సమ­ర్పించారని హైకోర్టు స్పష్టం చేసింది.

తదుపరి విచారణను జూన్‌ 17కి వాయిదా వేసింది. ఈ లోపు పోలీసులు ఏమైనా చేయొచ్చునంటూ సీసీటీవీ ఫుటేజీ తాలూకు హార్డ్‌ డిస్క్‌ను సీల్డ్‌ కవర్‌లో భద్ర­పర­చాలని రిజి­స్ట్రార్‌ జుడీషియ­ల్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచా­రణ సమయంలో దాన్ని తమ ముందు ఉంచాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, డాక్టర్‌ జస్టిస్‌ కుంభజడల మన్మథరావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్భంధంపై ఆయన భార్య కళ్యాణి గతంలో హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తన భర్తను పోలీసులు నవంబరు 8వ తేదీనే అదుపులోకి తీసుకుని, రెండు రోజుల తరువాత అరెస్ట్‌ చూపారని హైకోర్టుకు నివేదించారు.

పుల్లూరు టోల్‌ ప్లాజా వద్ద సీసీ టీవీ ఫుటేజీని భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్‌ రఘునందన్‌రావు ధర్మాసనం, పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని తమ ముందు ఉంచాలని జాతీయ రహదారుల సంస్థను ఆదేశించింది. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజీని కోర్టు ముందుంచారు. ఇందులో ఎవరెవరు ఉన్నారో పరిశీలించి, ఆ వివరాలను తెలపాలని కళ్యాణి తరఫు న్యాయవాదులు, పోలీసుల తరఫు న్యాయవాదులను ధర్మాసనం ఆదే­శించిది. తాజాగా ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది.

AP High Court: కోర్టుకే అబద్ధాలు చెబుతారా?

రవీంద్రరెడ్డిది అక్రమ నిర్భంధమే...
కళ్యాణి న్యాయవాది వీఆర్‌రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ, రవీందర్‌రెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని తెలిపారు. ధర్మాసనం ఆదేశాల మేరకు ఇటీవల తాము హైకోర్టు రిజిస్ట్రార్‌ జుడీషియల్‌ సమక్షంలో సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించామన్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను, సీసీ టీవీ ఫుటేజీ హార్డ్‌ డిస్క్‌ను కోర్టుకు సమర్పించామని తెలిపారు. గత ఏడాది నవంబరు 8న పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద రవీంద్రరెడ్డి, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చాలా స్పష్టంగా ఉందన్నారు. పోలీసులు మాత్రం 11న అరెస్ట్‌ చూపారన్నారు. పోలీసుల తరఫున ప్రభుత్వ సహాయ న్యాయవాది వాదిస్తూ, సీసీ టీవీ ఫుటేజీ పరిశీలన కోసం పోలీసుల తరఫున తాను హాజరయ్యానని తెలిపారు. ఫుటేజీకి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులతో మాట్లాడిన తరువాత కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. ఇందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. వేసవి సెలవుల తరువాత విచారణ జరపాలని కోరారు.

బుకాయిస్తూ వచ్చిన పోలీసులు..
ఇంతకాలం వర్రా రవీంద్రరెడ్డిని అక్ర­మంగా అరెస్ట్‌ చేయలేదంటూ బుకా­యిస్తూ వచ్చిన పోలీసులు ఇప్పుడు హైకోర్టుకు అడ్డంగా దొరికిపోయారు. సీసీ కెమెరాల సాక్షిగా హైకోర్టుకు చిక్కారు. కర్నూలు, పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద వర్రా రవీంద్రరెడ్డిని గత ఏడాది నవంబరు 8న అదుపులోకి తీసుకుని, 10న మాత్రమే అదుపులోకి తీసుకున్నా­మంటూ ఇన్ని రోజులుగా హైకోర్టును నమ్మిస్తూ వచ్చిన పోలీసులు అబద్ధం చెప్పినట్లు తేలిపోయింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement