61 రోజులపాటు చేపల వేట నిషేధం
సాక్షి, అమరావతి: చేపల పునరుత్పత్తి కోసం 61 రోజులపాటు అమలు చేయనున్న వేట నిషేధం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తుంది. తూర్పు తీర భారత ప్రాదేశిక జలాల్లో జూన్ 15 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి, పరిరక్షణ, నిర్వహణకైఏటా క్రమం తప్పకుండా ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఈ సమయంలో మోటారు వినియోగించని సాంప్రదాయ బోట్లకు వేట నిషేధం నుంచి మినహాయింపు ఉంది.
కాగా మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లపై మాత్రం లోతు జలాల్లో వేట నిషేధం. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే బోట్లతో సహా అందులో ఉండే మత్స్య సంపదను స్వాదీనం చేసుకోవడంతోపాటు ఆయా బోట్ల యజమానులు ఏపీ సముద్ర మత్స్య క్రమబద్దికరణ చట్టం 1994 సెక్షన్ (4)కింద శిక్షార్హులు. నిషేధం పక్కాగా అమలు చేసేందుకు మత్స్యశాఖ, కోస్ట్గార్డు, కోస్టల్ సెక్యురిటీ, నేవీ, రెవెన్యూ అధికారులతో బృందాలను ఏర్పాటు చేశారు.


