ఏజెన్సీలో ఎదురుకాల్పులు | 15 Maoists escape in Allur Seetharamaraju district | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో ఎదురుకాల్పులు

Apr 30 2025 5:30 AM | Updated on Apr 30 2025 5:37 AM

15 Maoists escape in Allur Seetharamaraju district

పోలీసులు, మావోయిస్టుల మధ్య పేలిన తూటాలు  

కూంబింగ్‌ సమయంలో ఎదురెదురు పడిన రెండు వర్గాలు  

తప్పించుకున్న 15 మంది మావోయిస్టులు 

కీలక నేతలు గాజర్ల రవి, జగన్‌ ఉన్నట్టు ప్రచారం 

మావోయిస్టుల సామగ్రి స్వాదీనం 

సాక్షి, పాడేరు: అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు, వై.రామవరం, జీకే వీధి మండలాల సరిహద్దు  పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులతో మార్మోగింది. సోమవారం ఉదయం, మధ్యాహ్న సమయంలో అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. 15 మంది మావోయిస్టులు  త్రుటిలో తప్పించుకున్నారు. దీంతో అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగి అటవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్నట్టు తెలుస్తోంది.  

కొద్ది రోజులుగా కూంబింగ్‌  
మావోయిస్టుల సంచారంపై  సమాచారం అందుకున్న పోలీసు యంత్రాంగం ఎస్పీ అమిత్‌బర్ధర్‌ ఆదేశాలతో కొద్ది రోజుల నుంచి విస్తృతంగా కూంబింగ్‌ చేపట్టింది. సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో కాకులమామిడి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో 15 మంది మావోయిస్టులు పోలీసులకు ఎదురుపడి కాల్పులు జరిపారు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసు బలగాలూ మావోయిస్టులపై కాల్పులు జరిపాయి. మావోయిస్టులు సామగ్రి వదిలి తప్పించుకున్నారు. 

గాలింపు చర్యలను పోలీసులు కొనసాగిస్తున్న నేపథ్యంలో మళ్లీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కాంటవరం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. అక్కడా మావోయిస్టులు వదిలిపెట్టిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల్లో కీలకనేతలు గాజర్ల రవి, జగన్‌లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కిట్‌ బ్యాగులలో కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. కొందరు మావోయిస్టులకు గాయాలయ్యాయనే అనుమానంతో పోలీసులు కూంబింగ్‌ను విస్తతం చేశారు.   

8 రకాల సామగ్రి స్వాదీనం 
రెండు ఎదురు కాల్పుల సందర్భంగా మావోయిస్టులకు చెందిన 8 రకాల సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అమిత్‌బర్ధర్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎల్‌ఆర్‌ మ్యాగజైన్, అమ్యూనిషన్, ఆధునిక కమ్యూనికేషన్‌ పరికరాలు, కిండల్‌ ట్యాబ్, మావోయిస్టు సాహిత్యం, దుస్తులు, ఔషధాలు, సిరింజీలు, కిట్‌బ్యాగులు, టార్పాలిన్, వండిన భోజనం, ఇతర లాజిస్టిక్స్‌ను మావోయిస్టులు వదిలిపెట్టి పారిపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టుల జాడపై సమాచారం ఉంటే ప్రజలు తమకు తెలియజేయాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement