గార్లదిన్నె: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ మంజూరు చేస్తున్నట్లు విద్యుత్శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని తిమ్మంపేట ఎస్సీ కాలనీలో పీఎం సూర్యఘర్ సోలార్ పథకం ఉత్సవాలు నిర్వహించారు. మొదటగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఈ మాట్లాడారు. ఈనెల 14 వరకూ పీఎం సూర్యఘర్ పథకం ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఈ పథకం కింద 23.97 ఎండబ్ల్యూపీ సామర్థ్యంతో ఉచిత రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను 25 సంవత్స రాలు వ్యారెంటీతో ఏర్పాటు చేయిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 17,800 మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. మొదటి దశలో జిల్లాలో 65 వేల ఎస్సీ, 10 వేల ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.205 ఖర్చుతో జూన్ నెలాఖరులోపు 8 నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సోలార్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఈఈ రమేష్ బాబు, ఏడీ రఘు, ఏఈ విజయ్కుమార్ , విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్


