● వైభవం.. రంగనాథుడి రథోత్సవం
గుత్తి రూరల్: మండలంలోని తొండపాడు గ్రామంలో వెలసిన బొలికొండ రంగనాథస్వామి రథోత్సవం ఆదివారం వైభవంగా సాగింది. వేకువజామునే ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథుడి ఉత్సవ మూర్తుల కల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. సాయంత్రం ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగింపుగా తీసుకెళ్లి రథంపై అధిష్టించారు. రథోత్సవాన్ని ఎమ్మెల్యే జయరాం, ఈఓ శోభ ప్రారంభించారు. వేలాది మంది భక్తులు రంగనాథ స్వామి నామస్మరణ చేస్తూ రథాన్ని ముందుకు లాగారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పరిసరాలు కిక్కిరిసాయి.
ఉపాధి హామీ పథకాన్ని తొలగించే కుట్ర
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్
కూడేరు: వలసల నియంత్రనే లక్ష్యంగా అమలు చేసిన ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు సాగిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ విమర్శించారు. పేరు మార్చకుండా ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలంటూ సీపీఐ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం కూడేరు మండలం కమ్మూరు నుంచి అరవకూరు మీదుగా కూడేరు వరకు పాదయాత్ర సాగింది. కార్యక్రమంలో వారు మాట్లాడారు. పేదలకు నష్టాన్ని కలిగించే కొత్త చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని కొనసాగించేంత వరకూ పోరాటాలు సాగిస్తామని హెచ్చరించారు. సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, పద్మావతి, మల్లికార్జున, పెరుగు సంగప్ప, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
సాంఘిక అసమానతలను ప్రశ్నించాలి
● ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి
అనంతపురం కల్చరల్: ప్రజా సమస్యలు, సామాజిక అసమానతలు, దోపిడీ వ్యవస్థలను సాహిత్యం ద్వారా ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అభినందనీయమని అభ్యుదయ రచయితలను అరసం రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి అభినందించారు. అరసం (అభ్యుదయ రచయితల సంఘం) ఆధ్వర్యంలో 90 ఏళ్ల అభ్యుదయ సాహిత్యం కార్యక్రమంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం అనంతపురంలోని ఎకాలజీ సెంటర్లో జరిగింది. భారతీయ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు పెనుకొండ లక్ష్మీనారాయణ, డాక్టర్ రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్ జీవన సాఫల్య అవార్డు గ్రహీత డాక్టర్ శాంతినారాయణ, రాజారాం తదితరులు ప్రసంగించారు. సమసమాజాన్ని నెలకొల్పే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉందన్నారు. అనంతరం పలు పుస్తకాల సమీక్షలు జరిగాయి. విశాఖపట్నం బసు పోతన రచించిన ‘మనిషి జాడను వెతుక్కుంటూ’ కవితా సంపుటిని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అరసం ప్రధాన కార్యదర్శి తన్నీరు నాగేంద్ర, సీనియర్ రచయితలు తరిమెల అమరనాథరెడ్డి, జనప్రియ కవి ఏలూరు యంగన్న, కడప ఈశ్వరరెడ్డి, ఉప్పరపాటి వెంకటేశులు, మధురశ్రీ, చెట్ల ఈరన్న, కొత్తపల్లి సురేష్, శేషగిరి రాయుడు, గోసల నారాయణస్వామి, యమున, విద్యావతి తదితరులు పాల్గొన్నారు.
● వైభవం.. రంగనాథుడి రథోత్సవం
● వైభవం.. రంగనాథుడి రథోత్సవం


