ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని గొర్రెల కాపరి దుర్మరణం
కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లి సమీపంలో కనగానపల్లి రహదారిలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కనగానపల్లికి చెందిన గొర్రెల కాపరి కుంటాల ఆదినారాయణ (42) తన కుమారుడు బన్నితో కలిసి మామిళ్లపల్లి సమీపంలో ఉన్న తన గొర్రెల మంద వద్దకు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒక్కసారిగా బైకు టైరు పంక్చర్ కావడంతో రోడ్డు పక్కనే ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆదినారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు బన్ని స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతునికి భార్య వరలక్ష్మి, ఒక కుమారుడు ఉన్నారు.
ఇల్లు లాక్కున్నాడు.. కేసులు బనాయించాడు
● టీడీపీ నేత తమ్మినేని నాగభూషణం బాధితుడి ఆవేదన
సాక్షి టాస్క్ఫోర్స్: ‘మంత్రి పయ్యావుల కేశవ్ పీఏ అంటూ బెదిరించాడు. నాపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా ఇంటిని లాక్కుని బయటకు గెంటేశాడు’ అంటూ వజ్రకరూరు మండలం ఛాయపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తమ్మినేని నాగభూషణంపై ఓ వ్యక్తి ఆరోపణలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అనంతపురం నగరానికి చెందిన బాధితుడు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ హరీష్నాయక్ శనివారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద విలేకర్లతో మాట్లాడారు. వజ్రకరూరు మండలం ఎన్ఎన్పీ తండా గ్రామానికి చెందిన రమావత్ లలితాభాయితో తనకు 2018లో వివాహమైందన్నారు. తమకు కుమారుడు, కుమార్తె సంతానం కాగా, తన తల్లిదండ్రులు సుశీలభాయి, లక్ష్మానాయక్, భార్యతో కలిసి అనంతపురంలో జీవనం సాగించేవారమన్నారు. కరోనా సమయంలో తండ్రి లక్ష్మానాయక్ మృతి చెందగా, అప్పటి నుంచి తన తల్లిని చూసుకోనంటూ లలితాభాయి తనతో తరచూ గొడవ పడుతుండేదన్నారు. రెండేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లి పోయిందన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకుడు తమ్మినేని నాగభూషణం ప్రోద్బలంతో వజ్రకరూరు పోలీస్స్టేషన్లో తనతో పాటు తల్లిపై కూడా కేసు పెట్టిందన్నారు. ఇదే అదునుగా టీడీపీ నేత రంగంలోకి దిగి అనంతపురంలోని తన ఇంటిని స్వాధీనం చేసుకుని, తల్లితో పాటు తనను బయటకు గెంటేశారని వాపోయాడు. టీడీపీ నేత నుంచి తనకు ప్రాణహాని ఉందని, దీనిపై ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.


