33 ఏళ్లు కళ్లుగప్పి.. ఎట్టకేలకు దొరికి
● బంగారు ఆభరణాల చోరీ కేసులో
నిందితుడి అరెస్టు
కూడేరు: 33 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ నిందితుడు ఎట్టకేలకు దొరికాడు. కూడేరు పోలీసులు తెలిపిన మేరకు.. చెన్నేకొత్తపల్లికి చెందిన బోయ నరసింహులు 33 ఏళ్ల క్రితం కూడేరు మండలం జల్లిపల్లి వద్ద మదనపల్లి డిపోకు చెందిన బస్సును అడ్డగించాడు. కత్తులు చూపి ప్రయాణికుల వద్ద బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు కూడేరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎంత గాలించినా నరసింహులు ఆచూకీ మాత్రం లభించలేదు. అతని అరెస్టు వారెంట్ 33 ఏళ్లుగా అనంతపురం కోర్టులో పెండింగ్లో ఉంది. ఇటీవల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ఎట్టకేలకు నరసింహులును ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అనంతపురంలోని కోర్టులో జడ్జి ఎదుట హాజరు పరచి రిమాండ్కు పంపారు.
పంట రుణాల కోసం బ్యాంకు ఎదుట ధర్నా
ఉరవకొండ: పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉరవకొండలోని యూనియన్ బ్యాంకు ఎదుట కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగారెడ్డి, బాలరంగయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు పెద్దముస్టూరు వెంకటేష్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కౌలు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదన్నారు. ప్రస్తుతం రైతులు మిరప, వరి, కంది సాగు చేస్తున్నారని, అయితే వీరికి ఇప్పటి వరకు బ్యాంకు రుణాలు మంజూరు కాలేదన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కౌలు రైతులకు రెండు లక్షల వరకూ రుణాలు మంజూరు చేయాలనే నిబంధన ఉన్నా బ్యాంకర్లు అమలు చేయడం లేదన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం కౌలు రైతులకు వర్తింపచేయాలన్నారు. అనంతరం బ్యాంకు సిబ్బందికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నాయకులు సుంకన్న, శీనప్ప, రామాంజనేయులు, ఆంజనేయులు, నాగవేణి, తిప్పమ్మ, భారతి తదితరులు పాల్గొన్నారు.
హెచ్ఐవీ నియంత్రణ అందరి బాధ్యత
● జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాజశేఖర్
అనంతపురం మెడికల్: హెచ్ఐవీ నియంత్రణ అందరి బాధ్యత అని జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హెచ్ఐవీ పట్ల యువత అవగాహన కల్గి ఉండాలన్నారు. హెచ్ఐవీ రోగుల పట్ల వివక్షకు ఆస్కారం లేకుండా వారికందించే సేవల్లో నాణ్యత పెంచాలన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబ దేవి మాట్లాడుతూ హెచ్ఐవీ రోగులకు మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తునట్లు పేర్కొన్నారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ జయలక్ష్మి మాట్లాడుతూ ఆరోగ్యశాఖ ద్వారా విస్తృత కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ర్యాలీ ఆర్ట్స్ కళాశాల నుంచి క్లాక్టవర్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు సాగింది. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రమణ్యం, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, డెమో నాగరాజు, డిప్యూటీ హెచ్ఈఈఓ త్యాగరాజు, డీపీఎం వెంకటరత్నం, అనంత నెట్వర్క్ వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
33 ఏళ్లు కళ్లుగప్పి.. ఎట్టకేలకు దొరికి
33 ఏళ్లు కళ్లుగప్పి.. ఎట్టకేలకు దొరికి


