షీప్ సొసైటీ ఎన్నికలకు వేళాయె
అనంతపురం అగ్రికల్చర్: గొర్రెలు, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాల (షీప్ సొసైటీ)కు ఎన్నికలు నిర్వహించడానికి పశుసంవర్ధకశాఖ షీప్ డెవలప్మెంట్ విభాగం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 350 సొసైటీలు రిజిస్టర్ చేసుకోగా... అందులో డిపార్ట్మెంట్ యూనియన్ పరిధిలో 215 సొసైటీలు ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఉమ్మడి జిల్లా పరిధిలో 130 సంఘాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. పెండింగ్లో ఉన్న 84 సొసైటీలకు డిసెంబర్ 5, 12న రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న మదిగుబ్బ సొసైటీకి ఎన్నిక నిలిపివేశారు. 2018లో ఎన్సీడీసీ కింద రూ.10.66 కోట్ల రుణాల పంపిణీకి సంబంధించి సక్రమంగా కంతులు కట్టని 342 మందిని డిఫాల్టర్ జాబితాలో పెట్టినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. డీ–ఫాల్టర్లకు ఎన్నికల్లో పోటీ చేయడానికి, ఓటు వేయడానికి అర్హత లేదన్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో 45 సొసైటీలకు, శ్రీ సత్యసాయి జిల్లాలో 39 సొసైటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి విడత కింద ఈనెల 5న 55 సొసైటీలకు, రెండో విడతగా ఈనెల 12న 29 సొసైటీలకు ఎన్నిక జరగనుంది. ప్రాథమిక స్థాయిలో ఎన్నికలు పూర్త్తి కాగానే జిల్లా యూనియన్కు ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిసింది. ఒక్కో సొసైటీలో ఏడు డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించి తర్వాత ఆఫీస్ బేరర్లను ఎన్నుకోనున్నట్లు షీప్ డెవలప్మెంట్ ఏడీ డాక్టర్ కేఎల్ శ్రీలక్ష్మి తెలిపారు. కాగా, పార్టీలకు అతీతంగా జరుగుతున్న షీప్ సొసైటీ లను ఎలాగైనా దక్కించుకునేందుకు ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ‘పచ్చ’ నాయకులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. గత జనవరి, ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో సైతం తెలుగు తమ్ముళ్లు చాలా చోట్ల బెదిరింపులకు దిగి పాగా వేసిన విషయం తెలిసిందే.
తొలివిడత ఎన్నికలు జరగనున్న సొసైటీలివే..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపు (శుక్రవారం) తొలివిడతగా 55 షీప్ సొసైటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అందులో అనంతపురం జిల్లా పరిధిలో పంపనూరు, పాపంపల్లి, సనప, నీలంపల్లి, వెంకటాపురం, పి.యర్రదొడ్డి, నెలగొండ, సంగాల, ఈస్ట్కోడిపల్లి, ఎం.వెంకటాంపల్లి, పి.చెన్నంపల్లి, ఓబగానపల్లి, ఉదిరిపికొండ, బెస్తరపల్లి, బొందలవాడ, చామలూరు, ఎద్దులపల్లి, నరసాపురం, జూటూరు, బండార్లపల్లి, గాండ్లపర్తి, భోగినేపల్లి, సలకంచెరువు, గడేహొత్తూరు, హావలిగి ఉండగా... శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో మందనకుంట, ధేమకేతేపల్లి, గౌనివారిపల్లి, బాలంపల్లి, చలివెందుల, పరిగి, చాలకూరు, మాగేచెరువు, పత్తికుంటపల్లి, సోమందేపల్లి, గొడ్డువెలగల, డబురువారిపల్లి, వంచిరెడ్డిపల్లి, వెంకటగిరిపాలెం, రాంపురం, వెంగలమ్మచెరువు, కోగిర, ఎం.కొత్తపల్లి, రొద్దం, తురకలా పట్నం, యర్రాయపల్లి, హరియాణ్చెరువు, బిల్వంపల్లి, దాదులూరు, భానుకోట, కొండపల్లి, కేఎన్ పాళ్యం, తగరకుంట, గంగరెడ్డిపల్లి, దుబ్బార్లపల్లి సొసైటీలకు ఎన్నికలు జరగనున్నాయి.
12న 29 సొసైటీలకు..
రెండో విడత కింద ఈ నెల 12న ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో 29 సొసైటీలకు ఎన్నికలు జరగనున్నాయి.
రేపు 55 సొసైటీలకు,
12న 29 సొసైటీలకు ఎన్నికలు
వీటిని దక్కించుకునేందుకు టీడీపీ నాయకుల కుయుక్తులు


