
‘ఉపాధి’ అక్రమాలకు చెక్!
అనంతపురం టౌన్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా నూతన మార్గదర్శకాలను ప్రవేశపెడుతోంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు నూతన సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పనుల్లో పాలు పంచుకుంటేనే ఉపాధి వేతనం అందుతుంది. లేకపోతే లేదు.
గతంలో నకిలీ ఫొటోలతో దోపిడీ..
గతంలో ఉపాధి హామీ పథకం నిధులను అడ్డగోలుగా దోచేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లు చేతి వాటం ప్రదర్శించి జాబ్కార్డు ఉంటే చాలు ఉపాధి పనులకు రాకున్న వచ్చినట్లు ఎన్ఎంఎంఎస్ యాప్లో నకిలీ ఫొటోలను అప్లోడ్ చేసి వేతనాల రూపంలో రూ.కోట్లు కొల్లగొట్టేశారు. బుక్కరాయసముద్రం మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో 2వేలమంది ఉపాధి కూలీలు ఉంటే రోజు వారీగా 1,900 మందికి పైగా పనులకు హాజరైనట్లు ఎన్ఎంఎంఎస్ యాప్లో నమోదు చేశారంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గ్రామం మొత్తం ఉపాధి పనులకు హాజరవడంపై జిల్లా అధికార యంత్రాంగమే విస్తుపోయింది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తే కేవలం 200మంది మాత్రమే కనిపించారు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు 20 రోజుల వేతనాలను నిలుపుదల చేశారు. జిల్లాలోని 32 మండలాల్లో ఇదే తంతు కొనసాగినట్లుగా అప్పట్లో అధికారులు గుర్తించారు.
ప్రతి సోమవారం వేతనాలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6.86 లక్షల జాబ్కార్డులు, 11.58 లక్షల మంది శ్రామికులు ఉన్నారు. అనంత జిల్లాలో 3.16లక్షల జాబ్కార్డులు, 5.38 లక్షల మంది శ్రామికులు, శ్రీసత్యసాయి జిల్లాలో 3.70 లక్షల జాబ్ కార్డులు, 6.20 మంది శ్రామికులున్నారు. వీరి జాబ్కార్డులను ఆధార్తో అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 80 శాతానికి పైగా అనుసంధాన ప్రక్రియను పూర్తయింది. పనులకు హాజరయ్యే శ్రామికులకు ఈ–కేవైసీని తప్పనిసరి చేయడంతో కష్టించిన వారికి మాత్రమే వేతనాలు వారి ఖాతాల్లో జమ కానున్నాయి. వారంలో ఎన్ని రోజులు పని చేసినా.. పని చేసిన రోజులకు సంబంధించి ప్రతి సోమవారం వేతనాలు వారి ఖాతాల్లోనే నేరుగా జమ చేయనున్నారు. ప్రతి రోజూ రెండు పర్యాయాలు పనులకు హాజరైన ఫొటో, పనులు ముగించిన అనంతరం మరో ఫొటో ఆధారిత హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది.
కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టిన
కేంద్ర ప్రభుత్వం
జాబ్కార్డులకు ఆధార్ అనుసంధానం
15 నుంచి జిల్లాలో అమలు