
ప్రభుత్వ వైఫల్యంతోనే..
అనంతపురం: అధికారం కోసం అలవిగాని హామీ ఇచ్చారు. బాధ్యతలు చేపట్టాక తుంగలో తుక్కారు. అసలు నేడు దాని గురించి పట్టించుకోవడమే మానేశారు. కూటమి ప్రభుత్వం అలసత్వం కారణంగా ఎస్కేయూ ఖ్యాతి పడిపోయింది. ఒకప్పుడు వెలుగు వెలిగిన విశ్వ విద్యాలయం నేడు మూసివేత దిశగా పయనిస్తోందంటే అతిశయోక్తి కాదేమో!
గతంలో ఎన్నడూ లేని విధంగా
కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్కేయూలో పీజీ విభాగాలు వెలవెలబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీట్లు భర్తీ కాక కళ తప్పాయి. ఈ విద్యా సంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 27లోపు కళాశాలలో రిపోర్ట్ చేయాలని అభ్యర్థులకు సూచించారు. ఇప్పటి వరకూ పీజీ అడ్మిషన్లకు సంబంధించి కేవలం 328 సీట్లు భర్తీ అయ్యాయి. క్యాంపస్ కళాశాలలో మొత్తం 2 వేల సీట్లు ఉండగా, 328 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లిష్ 09, అడల్ట్ ఎడ్యుకేషన్ 01,తెలుగు09,హిందీ 03,సోషియాలజీ 00,సోషల్ వర్క్ 01, లైబ్రరీ సైన్సెస్ 07, రూరల్ డెవలప్మెంట్ 01,హిస్టరీ 08, పొలిటికల్ సైన్సెస్ 15, పబ్లిక్అడ్మినిస్ట్రేషన్ 02,అప్లైడ్ ఎకనామిక్స్ 00, ఎకనామిక్స్02, కామర్స్ 17, బయోకెమిస్ట్రీ 11, బయోటెక్నాలజీ 12, మైక్రోబయాలజీ 11, బోటనీ 11, సెరికల్చర్ 09,జువాలజీ 12,అప్లైడ్ మేథమేటిక్స్ 04, మేథమేటిక్స్ 05,స్టాటిస్టిక్స్ 04, ఫిజిక్స్ 06, కెమిస్ట్రీ 34, పాలిమర్ సైన్సెస్ 01, జియాగ్రఫీ 06, ఇన్స్ట్రుమెంటేషన్ 06, సెల్ఫ్ ఫైనాన్స్ 61, పేమెంట్ సీట్లు 60 చొప్పున భర్తీ అయ్యాయి. నామమాత్రపు అడ్మిషన్లతో ఎస్కేయూ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులు లేకటీచింగ్ ఫ్యాకల్టీ సంఖ్య సైతం తగ్గిపోనుంది. టీచింగ్ అసిస్టెంట్లు, అకడమిక్ కన్సల్టెంట్లు ఇంటి దారే పట్టే దుస్థితి తలెత్తుతోంది.
ఆశపెట్టి..
గత సార్వత్రిక ఎన్నికల ముందు పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. తన యువగళం పాదయాత్రలో నేటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం విద్యార్థులకు ఆశపెట్టారు. అయితే ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయినా ఈ అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఫలితంగా పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకోవడానికి విద్యార్థులు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. మరో వైపు వర్సిటీలో పీజీ అడ్మిషన్లు పెంచేందుకు యాజమాన్యం కూడా సరైన చర్యలు తీసుకోలేదు. కోర్సులు పూర్తయిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
విద్యార్థులను పట్టించుకోవడం లేదు
ఎస్కేయూ క్యాంపస్లో భారీగా పడిపోయిన అడ్మిషన్లు
మొత్తం 2,000 సీట్లకు 328 సీట్లే భర్తీ
నాలుగు విభాగాల్లో కేవలం
ఒక్కో అడ్మిషనే
సోషియాలజీ, అప్లైడ్ ఎకనామిక్స్ విభాగాల్లో అడ్మిషన్లే లేవు
కూటమి ప్రభుత్వం నిర్వాకంతో దుస్థితి
వర్సిటీ యాజమాన్యం
నిర్లక్ష్యమూ మరో కారణం
కూటమి ప్రభుత్వం వస్తే వంద రోజుల్లోనే పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇప్పటిదాకా ఆ విష యంపై అసలు దృష్టి సారించనేలేదు. ఎస్కేయూనే కాదు రాష్ట్రంలో ఉన్న వర్సిటీలన్నింటి పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. అయినా, పట్టించుకునే నాథుడే లేరు.
–ఈ. కుళ్లాయిస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఏడాదిన్నరగా ఎస్కేయూకు రెగ్యులర్ వైస్ చాన్స్లర్ నియామకం కాలేదు. ఇన్చార్జ్ వైస్ చాన్స్లర్ తోనే పాలన కొనసాగిస్తున్నారు. ఒక వర్సిటీకి ఏడాదిన్నరగా వైస్ చాన్స్లర్ను నియమించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఎస్కేయూ ఇన్చార్జ్ వీసీ, రిజిస్ట్రార్లు విద్యార్థుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
– పి. హేమంత్కుమార్, వైఎస్సార్ విద్యార్థి విభాగం, ఎస్కేయూ

ప్రభుత్వ వైఫల్యంతోనే..

ప్రభుత్వ వైఫల్యంతోనే..