
రేషన్ బియ్యం కృష్ణార్పణం
ధర్మవరం: మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని సోమందేపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రేషన్ బియ్యం మాఫియా డాన్గా అవతార మెత్తాడు. తొలుత పెనుకొండ నియోజకవర్గంతో మొదలు పెట్టి... మెల్లమెల్లగా మూడు జిల్లాలను శాసించే స్థాయికి ఎదిగాడు. ప్రతినెలా ఇతని అక్రమ సంపాదన రూ.కోటికి పైగానే ఉండటం ప్రజల్ని విస్మయానికి గురి చేస్తోంది.
దందా ఇలా..
రేషన్ బియ్యం అక్రమ రవాణాను సదరు మాఫియా డాన్ కొత్త పుంతలు తొక్కించాడు. ఒకేసారి పెద్ద మొత్తంలో స్టాక్ ఉంచితే అందరికీ తెలిసిపోతుందని భావించి వినూత్నంగా ప్లాన్ చేశాడు. ఒక్కో జిల్లాలో 5 లేదా 6 వరకు స్టాక్ పాయింట్లు పెట్టుకుని అర్ధరాత్రి సమయంలో రవాణా చేస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఒక్కో నియోజకవర్గంలోని మండలం, పట్టణాలను వేరుచేసి రిటైల్గా కొంత మందికి కిలోపై రూ.3 చొప్పున కమీషన్ చెల్లిస్తూ బియ్యం సేకరించేలా పురమాయించాడు. సేకరించిన బియ్యాన్ని ఆటోలు, టాటా ఏస్ వాహనాల ద్వారా స్టాక్ పాయింట్కు చేరుస్తారు. అక్కడి నుంచి రేషన్ మాఫియా డాన్ రాత్రి వేళ భారీ వాహనాల్లో గంటల వ్యవధిలోనే సరిహద్దులు దాటించి కర్ణాటకకు చేరవేస్తాడు.
వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తోందిలా..
తొలుత పెనుకొండ నియోజకవర్గం నుంచి మొదలు పెట్టిన రేషన్ దందాను ఆ తర్వాత ధర్మవరం నియోజకవర్గానికి సదరు డాన్ విస్తరించాడు. ధర్మవరానికి సమీపంలోని ఎన్ఎస్గేట్, సీకేపల్లి మండలం ప్యాదిండి, నామాల, మేడాపురం వద్ద స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశాడు. ధర్మవరం మండలంలో వివిధ రేషన్ షాపులు, ప్రజల నుంచి సేకరించిన బియ్యాన్ని ఆటోల్లో స్టాక్ పాయింట్లకు తరలిస్తారు. అలాగే అనంతపురం జిల్లాలోని వివిధ మండలాల్లో సేకరించిన బియ్యాన్ని రాప్తాడు మండలం కందుకూరు కెనాల్కు కూతవేటు దూరంలో ఏర్పాటు చేసిన స్టాక్పాయింట్లో నిల్వ చేస్తాడు. ఇలా నిల్వ చేసిన బియ్యాన్ని ఐచర్ వాహనాల్లో లోడ్ చేసి కర్ణాటకలోని బంగారు పేటలో ఉన్న మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటాడు. సదరు మిల్లులో లావు బియ్యాన్ని సన్న బియ్యంగా ప్రాసెస్ చేసి అధిక ధరతో మళ్లీ ప్రజలకు విక్రయిస్తుండడం గమనార్హం.
మూడు జిల్లాల్లో జోరుగా వ్యాపారం..
శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం, పెనుకొండ, హిందూపురం, అనంతపురం జిల్లా పరిధిలోని ఉరవకొండ, రాప్తాడు, అనంతపురం నియోజకవర్గాలతో పాటు వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో కూడా బియ్యం అక్రమ వ్యాపారాన్ని సదరు డాన్ విస్తరించినట్లు సమాచారం. ఇటీవల పులివెందులలో పట్టుబడ్డ రేషన్ బియ్యం కూడా సదరు డాన్వే అయినా బినామీలను చూపి బయటపడినట్లు తెలుస్తోంది.
అనతికాలంలోనే భారీగా అక్రమార్జన..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే రేషన్బియ్యం అక్రమ వ్యాపారంలో భారీగా అక్రమార్జన చేసినట్లు సమాచారం. ఆంధ్రాలో పేదల బియ్యాన్ని రిటైలర్ల దగ్గర రూ.18 చొప్పున కొని కర్ణాటకలో రూ.27 లెక్కన అమ్ముకుంటున్నారు. వందలాది వాహనాలలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ ప్రతినెలా రూ.కోటికిపైగానే సంపాదిస్తున్నట్లు సమాచారం.
రాజకీయ ఒత్తిళ్లు..
కొందరు నిజాయితీ గల పోలీస్ అధికారులు రేషన్ బియ్యం వాహనాలను పట్టుకుంటే... వెంటనే జిల్లాలోని ఓ పార్లమెంట్ స్థాయి ప్రజాప్రతినిధితో పాటు బీజేపీకి చెందిన జిల్లా నాయకుడు రంగ ప్రవేశం చేసి కేసులు కట్టకూడదని ఒత్తిడి తీసుకెళుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా ధర్మవరం మండలం సీతారాం పల్లి వద్ద సదరు రేషన్ మాఫియా డాన్కు చెందిన ఓ ఐచర్ వాహనాన్ని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కేసు కట్టకూడదని పోలీసులపై సదరు నేతలు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. వాహనంలో ఉన్నవి రేషన్ బియ్యం కాదని మీడియాకు చెప్పాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం.
దీంతో తెల్లవారుజామున పట్టుకున్న బియ్యం వివరాలను సాయంత్రమైనా పోలీస్, రెవెన్యూ అధికారులు వెల్లడించక పోవడం గమనార్హం.
పేదల బియ్యం.. పెద్దల భోజ్యం
‘పుష్ప’ సినిమాను తలపించేలా రేషన్ బియ్యం స్మగ్లింగ్
మూడు జిల్లాలను శాసిస్తున్న సోమందేపల్లి ‘డాన్’
అక్రమ దందాతో రూ.కోట్లు గడిస్తున్న వైనం
అధికార పార్టీ అండతో ఇష్టారాజ్యం
పట్టించుకోని అధికార గణం
అధికారులకు మామూళ్లు..
మూడు జిల్లాల రేషన్ బియ్యం వాహనాలు ధర్మవరం, సీకేపల్లి, సోమందేపల్లి, కియా పోలీస్స్టేషన్, కొడికొండ చెక్పోస్టు మీదుగా వెళ్తుంటాయి. ఈ మార్గంలోని పోలీస్స్టేషన్లకు రేషన్ మాఫియా డాన్ ప్రతి స్టేషన్కు ఒక్కో రేట్ ఫిక్స్ చేసి మామూళ్లు ముట్ట చెప్పుతుండడం విశేషం. ఒకవేళ సదరు స్టేషన్లలో పోలీస్ ఉన్నతాఽధికారులు లంచం తీసుకునేందుకు నిరాకరిస్తే కిందిస్థాయి సిబ్బందితోనే పని చక్కబెడుతుంటాడు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన విజిలెన్స్ అధికారులు కూడా మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలున్నాయి. రూ.1.80 లక్షల చొప్పున విజిలెన్స్ అఽధికారుల్లో కొందరికి మామూళ్లు అందుతుండటంతో వారు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలున్నాయి.
పుష్ప సినిమాలో గంధపు చెక్కల స్మగ్లింగ్ను
తలదన్నేలా రేషన్ బియ్యం అక్రమ దందా
ఉమ్మడి జిల్లాలో జోరుగా సాగుతోంది.
సోమందేపల్లికి చెందిన ఓ రేషన్ మాఫియా డాన్ ఏకంగా మూడు జిల్లాల్లో తన అక్రమ వ్యాపారాన్ని విస్తరించాడు. రాజకీయ నాయకులతో పాటు అధికారులకూ భారీగా ముడుపులు ముట్టజెబుతూ రూ.కోట్లు గడిస్తున్నాడు. అతని దందా విస్తృతి చూసి ‘రామ’రామ.. ‘కృష్ణ’ కృష్ణ అంటూ అధికారులే నివ్వెరపోతున్నారు.

రేషన్ బియ్యం కృష్ణార్పణం