
డయేరియా వ్యాప్తి కాకుండా చర్యలు చేపట్టండి : డీఎంహెచ్ఓ
శింగనమల: గ్రామాల్లో డయేరియా వ్యాప్తి చెందకుడా చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులను డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి ఆదేశించారు. శింగనమల సీహెచ్సీలో డయేరియాతో చికిత్స పొందుతున్న పెద్దమట్లగొంది గ్రామానికి చెందిన 14 మందిని సోమవారం ఆమె ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వాంతులు, విరేచనాలకు గల కారాణాలపై ఆరా తీశారు. అనంతరం పెద్దమట్లగొంది గ్రామాన్ని సందర్శించి, అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్కడే ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. ఆమె వెంట తరిమెల పీహెచ్సీ వైద్యులు డాక్టర్.శంకర్ నాయక్, వైద్య సిబ్బంది ఉన్నారు.
మట్కా బీటర్ల అరెస్ట్
అనంతపురం: నగరంలోని సాయి నగర్ రెండో క్రాస్ చివరన మట్కా ఆర్గనైజర్తో పాటు 8 మంది బీటర్లను అరెస్ట్ చేసినట్లు టూ టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. వివరాలను సోమవారం రాత్రి ఆయన వెల్లడించారు. పట్టుబడిన వారిలో అనంతపురంలోని సంగమేశ్వర నగర్కు చెందిన తుమ్మల సరస్వతి, చంద్రబాబు కొట్టాల వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న నివాసమున్న షేక్ రసూల్, పాతూరు మున్నా నగర్కు చెందిన బండారి వన్నూరప్ప, అంబేడ్కర్ నగర్కు చెందిన మన్నల రామకృష్ణ, అనంతపురం రూరల్ మండలం కృష్టమరెడ్డిపల్లి నివాసి వడ్డే దస్తగిరి, ఉప్పరపల్లికి చెందిన అక్కెం రామాంజినేయులు, బోయ శ్రీరాములు, ఆత్మకూరు మండలం బి.యాలేరు గ్రామానికి చెందిన పోతులయ్య అలియాస్ పోతన్న ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదు, మట్కా పట్టీలు, బాల్ పెన్నులను స్వాధీనం చేసుకున్నారు.
వైభవంగా ఖాద్రీశుడి
కల్యాణోత్సవం
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని రంగ మంటపంలో శ్రీదేవి భూదేవి సమేత వసంతవల్లభునికి సోమవారం కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో అర్చకులు సంతోష్ స్వామి, మంజునాథ్ స్వామి ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ చేశారు. హోమాలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
లారీల ఢీ – ఒకరి మృతి
విడపనకల్లు: మండలంలోని గడేకల్లు వద్ద 67వ జాతీయ రహదారిపై సోమవారం రెండు లారీలు ఢీ కొన్నాయి. ఘటనలో ఓ డ్రైవర్ మృతి చెందాడు. లారీలు రెండూ పరస్పరం ఢీకొనడంతో క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. క్యాబిన్లో ఇరుక్కున్న హర్యానాకు చెందిన డ్రైవర్ జితేంద్రకుమార్ (35)ను స్థానికులు అతి కష్టంపై వెలికి తీసి వెనువెంటనే బళ్లారిలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బైక్ను ఢీ కొన్న టిప్పర్
పెద్దవడుగూరు: స్థానిక సాయిబాబా ఆలయంలో సమీపంలో సోమవారం ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొంది. ఘటనలో చిట్టూరు గ్రామానికి చెందిన యువకులు తరుణ్, మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. గ్రామం నుంచి మండల కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో భారీ వాహనం కిందకు బైక్ పడింది. బైక్పై ఉన్న ఇద్దరూ పక్కన పడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

డయేరియా వ్యాప్తి కాకుండా చర్యలు చేపట్టండి : డీఎంహెచ్ఓ

డయేరియా వ్యాప్తి కాకుండా చర్యలు చేపట్టండి : డీఎంహెచ్ఓ