
ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజల పక్షమే
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత
అనంతపురం కార్పొరేషన్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లోకి వెళ్లనివ్వ కుండా కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా పోలీసులను అడ్డంపెట్టుకుని వివాదాలకు తెరతీస్తోందని, ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మామిడి రైతులను పరామర్శించేందుకు వెళితే.. పోలీసులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, రైతులపై లాఠీచార్జ్ చేయడాన్ని బుధవారం ఓ ప్రకటనలో ఆయన ఖండించారు. సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయని, ధాన్యం, పొగాకు, మిర్చి రైతులు..ఇప్పుడు మామిడి రైతులు గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతున్నారని వాపోయారు. ఇలాంటి తరుణంలో మామిడి రైతుల పక్షాన నిలబడేందుకు వైఎస్ జగన్ వెళితే.. పోలీసులు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమన్నారు. పక్కా ప్లాన్తోనే ప్రభుత్వం, పోలీసులు జగన్ పర్యటనల్లో వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ వస్తున్నారని తెలియగానే రైతులు, నాయకులను బెదిరించారని, నోటీసులు జారీ చేశారని, జగన్ను కలిస్తే రౌడీషీట్లు తెరుస్తామని సాక్షాత్తు ఎస్పీ స్థాయి అధికారి బెదిరించడం చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలగకమానదన్నారు. తన వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించకూడదన్న ధోరణిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. ఎంత మందిపై కేసులు పెట్టినా ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.