
రెక్కీ నిర్వహించి.. గొలుసు అపహరణ
రాప్తాడు రూరల్: రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించిన అనంతరం ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును యువకుడు లాక్కొని ఉడాయించాడు. వివరాలు.. శింగనమల మండలం శివపురం గ్రామానికి చెందిన రమణయ్య, పద్మావతి దంపతులు కక్కలపల్లికాలనీ పంచాయతీ పరిధిలోని నందమూరినగర్లో స్థిరపడ్డారు. సొంతూరిలో ఉన్న భూముల్లో భర్త వ్యవసాయం చేస్తున్నాడు. పద్మావతికి గుండె శస్త్రచికిత్స జరగడంతో వ్యవసాయ పనులకు వెళ్లలేక కళ్యాణదుర్గం ప్రధాన రహదారి పక్కనే ఓ బంకు ఏర్పాటు చేసుకుని కూల్డ్రింక్స్, స్నాక్స్ విక్రయిస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఓ యువకుడు వచ్చి బంక్ వద్ద దాదాపు గంట పాటు కూర్చొని వెళ్లాడు. తిరిగి మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో అదే యువకుడు మరోమారు వచ్చి సిగరెట్ తీసుకుని తాగాడు. 2.30 గంటల వరకు అక్కడే కూర్చున్నాడు. అనంతరం నీళ్లు అడగడంతో ఇచ్చేందుకు పద్మావతి ఫ్రిజ్ తెరుస్తుండగా ఒక్క ఉదుటన వెనుక నుంచి నోటిని గట్టిగా అదిమపెట్టి మెడలో ఉన్న బంగారు చైనును లాక్కొని, ఆమెను గిరాటేసి వెళ్లిపోయాడు. ఈ హఠత్పరిణామంతో కాసేపటి వరకూ ఆమె కోలుకోలేక పోయింది. చైన్స్నాచింగ్కు పాల్పడిన యువకుడు ఎలాంటి బెదురు లేకుండా నింపాదిగా నడుచుకుంటూ వెళ్లడం విశేషం. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.