
చీటింగ్ టీచరుకు ‘అధికార’ అండ
అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యాపారులను చీటింగ్ చేసి కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడిన ప్రభుత్వ టీచరు కాకర్ల దివాకర్నాయుడుకు అధికార పార్టీకి చెందిన కొందరు పెద్దలు అండగా నిలిచారు. ఈ క్రమంలో ఆయనపై కనీస చర్యలు తీసుకోకుండానే తాత్కాలికంగా సస్పెన్షన్ ఎత్తివేయించి ఉద్యోగంలో చేరేలా చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం ఉపాధ్యాయుల్లో జోరుగా చర్చ సాగుతోంది. అనంతపురంలోని రాజేంద్ర నగర పాలక ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కాకర్ల దివాకర్నాయుడు చీటీల వ్యాపారంతో సుమారు రూ. 10 కోట్ల దాకా మోసానికి పాల్పడిన విషయం తెలిసిందే. అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత కూడా అసలు విషయం తెలీక కొందరు కొన్ని నెలలు పాటు క్రమం తప్పకుండా చీటీల మొత్తం చెల్లిస్తూ వచ్చారు. ఆయన భాగోతాన్ని గతేడాది జూలైలో వరుస కథనాలతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో బాధితులంతా అప్రమత్తమైనా అప్పటికే జరగాల్సిన నష్టం బాగా జరిగింది. కలెక్టర్, ఎస్పీని కలిసి విన్నవించడంతో వారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత విద్యాశాఖ సస్పెన్షన్ వేటు వేసింది.
ఆ ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు..
కాకర్ల దివాకర్నాయుడుకు తూర్పు రాయలసీమకు చెందిన ఓ ఎమ్మెల్సీ అండగా నిలిచినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసి స్కూల్కు పంపాలని, జీతానికి ఇబ్బంది లేకుండా చూడాలంటూ అధికారులపై ఒత్తిళ్లు చేశారు. ఈ అంశంపై జిల్లా స్థాయి అధికారులు నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో రాయలసీమ స్థాయి అధికారిపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో దివాకర్నాయుడుకు ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నోటీసు ఇవ్వకముందే సస్పెన్షన్ ఎత్తివేసి మే 1న అబుల్ కలాం స్కూల్కు కేటాయించారు. ఆ తర్వాత ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నోటీసు ఇచ్చారు. దీనిపై ఆయన వివరణ ఇస్తే ఆ తర్వాత విచారణకు ఓ అధికారిని నియమిస్తారు. విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. అయితే ఇప్పటిదాకా ఆయన వివరణ కూడా ఇవ్వలేదని తెలిసింది. ఇదే అంశంపై డీఈఓ ప్రసాద్బాబు మాట్లాడుతూ.. ‘దివాకర్నాయుడుపై సస్పెన్షన్ ఎత్తివేశాం. ఆ తర్వాత చార్జెస్ నోటీసు జారీ చేశాం. వివరణ ఇచ్చాడో లేదో తెలీదు. టీచర్ల బదిలీలు, పదోన్నతులు ఉండడం వల్ల కాస్తా ఆలస్యమైంది. వెంటనే వివరణ తీసుకుని విచారణ అధికారిని నియమిస్తాం. ఆలస్యం కాకుండా నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తాం’ అని పేర్కొన్నారు.
లబోదిబోమంటున్న బాధితులు..
చీటింగ్ కేసు నిందితుడు దివాకర్నాయుడు దర్జాగా తిరుగాడుతుండగా మరోవైపు బాధితులు లబోదిబోమంటున్నారు. విలాసవంతమైన జీవితం గడుపుతూ తమ డబ్బు చెల్లించకుండా చుక్కలు చూపిస్తున్నాడంటూ వాపోతున్రాను. ఇలాంటి వారికి అండగా నిలిచిన ప్రజా ప్రతినిధులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నోటీసు ఇవ్వకముందే
సస్పెన్షన్ ఎత్తివేత
ఆ తర్వాత నోటీసు జారీ చేసిన అధికారులు
విధుల్లో చేరి రెండు నెలలవుతున్నా నేటికీ ఇవ్వని వివరణ
తెర వెనుక ఉంటూ మంత్రాంగం నడుపుతున్న ఓ ఎమ్మెల్సీ