‘నైపర్‌’లో సత్తా | - | Sakshi
Sakshi News home page

‘నైపర్‌’లో సత్తా

Jun 26 2025 6:37 AM | Updated on Jun 26 2025 11:56 AM

అనంతపురం: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (నైపర్‌) జేఈఈ–2025 ప్రవేశ పరీక్షల్లో జేఎన్‌టీయూ (ఏ) ఓటీపీఆర్‌ఐ విద్యార్థులు సత్తా చాటారు. అఖిల భారత స్థాయిలో ర్యాంకులు సాధించారు. కే. గురు చరణ్‌ 793 ర్యాంకు, డి. హేమంత్‌ కుమార్‌ 1,561, జి. దేవీ ప్రియ 2,187, ఎస్‌. కుష్వంత్‌ 3,205, బి. ఆర్తి 3,527, కే. సాయి కిరణ్‌ 5,124, కె. హేమంత్‌ 5,254 ర్యాంకులతో మెరిశారు. ఈ సందర్భంగా ఓటీపీఆర్‌ఐ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ జీవీ సుబ్బారెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సి. గోపినాథ్‌ ఆయా విద్యార్థులను బుధవారం అభినందించారు.

ఆర్‌ఎస్‌కే సిబ్బంది బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌

అనంతపురం సెంట్రల్‌: రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారికి ఆఫ్‌లైన్‌లో,ఐదేళ్లలోపు సిబ్బంది రిక్వెస్ట్‌ బదిలీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రిక్వెస్ట్‌ బదిలీ ఉద్యోగులకు వారి సొంత మండలంలో కాకుండా ఇతర మండలాల్లో పోస్టింగ్‌ కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెలాఖరులోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌ తేదీలు ఖరారు చేసే పనిలో ఆయా శాఖల అధికారులు నిమగ్నమయ్యారు. 

ఉమ్మడి జిల్లాలో 867 రైతు సేవా కేంద్రాలున్నాయి. అనంతపురం జిల్లాలో 126 మంది, శ్రీ సత్యసాయి జిల్లాలో 124 మంది విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. వీరిలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు ‘అనంత’లో 101 మంది, ‘శ్రీ సత్యసాయి’లో 102 మంది ఉన్నారు. హార్చికల్చర్‌ అసిస్టెంట్లు ‘అనంత’లో 180 మంది,‘శ్రీ సత్యసాయి’లో 143 మంది ఉండగా అందరికీ ఐదేళ్లు పూర్తయ్యాయి. ఇక.. ఐదేళ్లు పూర్తి చేసుకున్న సెరికల్చర్‌ అసిస్టెంట్లు ‘అనంత’లో 12 మంది, ‘శ్రీ సత్యసాయి’లో 73 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పశు సంవర్ధక శాఖకు సంబంధించి 666 మంది వెటర్నరీ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు.

గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ

అనంతపురం సిటీ: గ్రామీణాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అన్నారు. పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా సర్పంచులకు అనంతపురం జిల్లా పరిషత్‌ క్యాంపస్‌లో గల డీపీఆర్‌సీ భవన్‌లో మూడ్రోజులుగా నిర్వహించిన డివిజనల్‌ స్థాయి శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. ముగింపు సభకు జెడ్పీ సీఈఓ శివశంకర్‌ అధ్యక్షత వహించగా, చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఒక ప్రధాన భాగమన్నారు. ఇలాంటి తరుణంలో కేవలం ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనంత మాత్రాన లక్ష్యం నెరవేరదన్నారు. 

పాలనలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకున్నప్పుడే రాజకీయాల్లో రాణించగలరన్నారు. ఇందుకు సరైన పరిజ్ఞానం, నైపుణ్యం, ఆత్మ విశ్వాసం అవసరమని పేర్కొన్నారు. మహిళా సర్పంచులు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకొని, గ్రామాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై అవగాహన పెంచుకోగలిగితే పాలనా రంగంలోనూ మహిళలు తీసిపోరని నిరూపించినట్లు అవుతుందన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా సర్పంచులకు డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య అభినందనలు తెలిపారు. అనంతరం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

‘నైపర్‌’లో సత్తా 1
1/1

‘నైపర్‌’లో సత్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement