చెత్త హామీతో ప్రజల చిత్తు | - | Sakshi
Sakshi News home page

చెత్త హామీతో ప్రజల చిత్తు

Jun 26 2025 6:37 AM | Updated on Jun 26 2025 6:37 AM

చెత్త

చెత్త హామీతో ప్రజల చిత్తు

అనంతపురం కార్పొరేషన్‌: కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అనంతపురంలో కంపోస్టు యార్డు తరలిస్తామని ‘తెలుగు తమ్ముళ్లు’ ప్రగల్భాలు పలికారు. అయితే, అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నేడు ఆ ఊసే ఎత్తడం లేదు. దీనికి తోడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇంత వరకు కంపోస్టు యార్డులో చెత్త నిర్వహణ జరగలేదు. రోజురోజుకూ చెత్త గుట్టలు గుట్టలుగా చేరుతోంది. కంపోస్టు యార్డులో దాదాపు 2 లక్షల టన్నులకుపైగా చెత్త ఉంది. నగరంలోని 50 డివిజన్లకు సంబంధించి 74 సచివాలయాల పరిధిలో రోజూ 120 టన్నుల నుంచి 140 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అందులో 12 నుంచి 18 టన్నులు ప్లాస్టిక్‌ ఉంటోంది. ఈ క్రమంలో చెత్త నిర్వహణ పక్కాగా చేపట్టేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రత్యక్ష నరకం..

కంపోస్టు యార్డు ఉండే గుత్తి రోడ్డు, ఆ చుట్టు పక్కల ప్రాంతాలైన లెక్చరర్స్‌ కాలనీ, రాజీవ్‌ కాలనీ వాసులతో పాటు ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఈదురుగాలులు వచ్చాయంటే భారీ మంటలు చెలరేగి దట్టమైన పొగ వస్తోంది. ఈ క్రమంలో పొగలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుత్తి రోడ్డు మార్గంలో ప్రయాణమంటేనే వాహనదారులు హడలెత్తి పోతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు లోనవుతున్నారు. ఇక.. కంపోస్టు యార్డు నుంచి వచ్చే దుర్వాసన భరించలేక అక్కడి ప్రజలు నిత్యం తలుపులు, కిటికీలు మూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

కలెక్టర్‌ దృష్టి సారిస్తేనే..

కంపోస్టు యార్డులో చెత్త నిర్వహణపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. సాధ్యమైనంత త్వరగా ప్రక్రియను ప్రారంభించి, పనికిరాని చెత్త, ప్లాస్టిక్‌ను అల్ట్రాటెక్‌, తదితర కంపెనీలకు పంపిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. నిషేధిత ప్లాస్టిక్‌ కూడా టన్నుల కొద్దీ కంపోస్టు యార్డులో పేరుకుపోయింది. ఈ క్రమంలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే విషవాయువులు వెలువడి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇప్పటికై నా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ స్పందించి కంపోస్టు యార్డును పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

‘అనంత’లో అటకెక్కిన కంపోస్టు యార్డు తరలింపు

అధికారంలోకి వస్తే చర్యలు తీసుకుంటామని ‘తమ్ముళ్ల’ ప్రగల్బాలు

ఏడాది పూర్తయినా పట్టించుకోని వైనం

స్థానికులు, వాహనదారులకు తీవ్ర అవస్థలు

చెత్త హామీతో ప్రజల చిత్తు 1
1/1

చెత్త హామీతో ప్రజల చిత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement