‘తమ్ముళ్ల’ బాహాబాహీ | - | Sakshi
Sakshi News home page

‘తమ్ముళ్ల’ బాహాబాహీ

Jun 25 2025 6:42 AM | Updated on Jun 25 2025 6:42 AM

‘తమ్ముళ్ల’ బాహాబాహీ

‘తమ్ముళ్ల’ బాహాబాహీ

శింగనమల మండల డీలర్ల సంఘం అధ్యక్షుడి ఎన్నికలో ఉద్రిక్తత

శింగనమల: మండల ప్రభుత్వ చౌకధాన్యపు డిపో డీలర్ల సంఘం అధ్యక్షుడి ఎన్నికలో టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి తన్నుకునేందుకు సిద్ధమయ్యారు. శింగనమల తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శింగనమల మండలంలో 45 ప్రభుత్వ చౌకధాన్యపు డిపో డీలర్లు ఉండగా.. డీలర్ల సంఘం అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవాలనే అంశంపై వారం రోజులుగా టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో చర్చించుకున్నారు. ఈ క్రమంలో సీనియర్‌ నాయకులందరూ సి.బండమీదపల్లికి చెందిన చెన్నయ్య పేరును ప్రతిపాదించగా, యువ నాయకులు శింగనమలకు చెందిన మసూదువలికి మద్దతు తెలిపారు. తహసీల్దార్‌ శేషారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ సూర్యప్రతాప్‌, సీఎస్‌డీటీ చంద్రకళ ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో మండల డీలర్ల సమావేశంలో డీలర్ల సంఘం అధ్యక్షుడి ఎన్నిక చేపట్టారు. సమావేశానికి డీలర్లతో పాటు టీడీపీకి చెందిన సీనియర్‌, జూనియర్‌ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తమకు చెప్పిందని సీనియర్లు, కాదు తమకే చెప్పిందని జూనియర్లు వాగ్వాదానికి దిగారు. ఒకానొక దశలో పరిస్థితి చేజారి నాయకులు తన్నుకునేందుకు సిద్ధమయ్యారు. తహసీల్దార్‌ శేషారెడ్డి, ఎస్‌ఐ విజయకుమార్‌ ఇరువర్గాలను ప్రాధేయపడి ఎమ్మెల్యే చెప్పిన వారికే అధ్యక్ష స్థానం కేటాయిస్తామని తెలపడంతో వివాదం సద్దుమణిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement