
యంత్ర సాయమేదీ?
● ఇప్పటి వరకూ అడ్రస్ లేని కిసాన్ డ్రోన్లు
● వ్యవసాయ యంత్ర పరికరాలకు రూ.3 కోట్లు కూడా ఖర్చు చేయని కూటమి ప్రభుత్వం
● వైఎస్సార్సీపీ హయాంలో రూ.16.40 కోట్ల రాయితీతో సీహెచ్సీల ఏర్పాటు
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడుగడుగునా రైతులు మోసపోతూనే ఉన్నారు. ఏడాది పూర్తయినా ఎలాంటి సాయం చేయకుండా ప్రభుత్వ పెద్దలు దాటవేత ధోరణి అవలంభిస్తున్నారు. ఇప్పటికే అన్నదాత సుఖీభవ, ఇన్పుట్, ఇన్సూరెన్స్ కింద ఆర్థిక సాయం అందించకుండా ఎగ్గొట్టారు. మరోపక్క అడిగిన ప్రతి రైతుకూ వ్యవసాయ యంత్ర పరికరాలు పెద్ద ఎత్తున అందిస్తామని గొప్పగా చెప్పినా.. ఆచరణలో మాత్రమం చేతులెత్తేశారు. యాంత్రీకరణకు కేటాయించిన రూ.3 కోట్లు బడ్జెట్ కూడా వెచ్చించకుండా మిగిలించేశారు.
కనిపించని డ్రోన్లు
వ్యవసాయ యంత్ర పరికరాల వితరణకు సంబంధించి కాగితాల్లో 50 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించినా మార్కెట్ ధరలను బట్టి చూస్తే రైతుకు 20 శాతం కూడా రాయితీ దక్కే పరిస్థితి లేదు. మరోపక్క కిసాన్ డ్రోన్లు ఇస్తామంటూ ఏడాదిగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్నారు. ఇప్పటికీ ఆ డ్రోన్లు ఎక్కడున్నాయో అంతుచిక్కడం లేదు. తొలి విడత కింద 50 శాతం రాయితీతో ఆర్ఎస్కేలకు అనుబంధంగా 35 డ్రోన్లు మంజూరైనట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఇది ఆచరణలోకి రాలేదు. డ్రోన్లు మంజూరు చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి యుటిలైజేషన్ సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత 50 శాతం రాయితీ విడుదల చేస్తామని మెలికపెట్టారు. దీంతో రైతుల్లో ఆసక్తి నశించింది. ఇప్పటికిపుడు రూ.5 లక్షలు చెల్లించడానికి రైతులు ముందుకు రాకపోవడంతో డ్రోన్ల కార్యాచరణ అడ్రస్ లేకుండా పోయింది.
అన్నదాతకు అండగా గత ప్రభుత్వం
గతంలో 2019–24 మధ్య అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిచారు. రూ.50 కోట్లకు పైగా విలువ చేసే యంత్ర పరికరాలను అందజేశారు. ప్రతి ఆర్బీకేకు అనుబంధంగా కమ్యూనిటీ హైయరింగ్ సెంటర్లు (సీహెచ్సీ) పేరున రైతు గ్రూపులు ఏర్పాటు చేసి వారు కోరుకున్న ట్రాక్టర్లు, ఇతర ఆధునిక యంత్రపరికరాలు రెండు విడతలుగా అందించారు. తొలివిడతగా రూ.8.25 కోట్ల రాయితీ ఇచ్చి 219 సీహెచ్సీలు ఇవ్వగా, రెండో విడతగా మిగతా రూ.8.15 కోట్లు రాయితీ ఇచ్చి 230 సీహెచ్సీలు మంజూరు చేశారు. ఒక్కో సీహెచ్సీలో రూ.15 లక్షలు విలువ చేసే కోరుకున్న ట్రాక్టర్తో పాటు ఆధునిక పరికరాలకు 40 శాతంతో రూ.16.40 కోట్ల మేర రాయితీ వర్తింపజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు విశిష్ట సేవలందిస్తున్న ఆర్బీకేలను ఆర్ఎస్కేలుగా పేరు మార్చి నిర్వీర్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.