
షెడ్ల నిర్మాణాలు పూర్తి చేయండి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం
అనంతపురం అర్బన్: సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్లకు (ఎస్డబ్ల్యూపీసీ) సంబంధించిన షెడ్ల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. పంచాయతీ సెక్టార్, ఇతర అంశాలపై కలెక్టర్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 526 ఎస్డబ్ల్యూపీసీలు ఉండగా 72 చోట్ల విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదన్నారు. 10 చోట్ల నీటి సరఫరా లేదని, 8 చోట్ల రోడ్డు కనెక్టివిటీ పనులు పెండింగ్ ఉన్నాయన్నారు. వీలైనంత త్వరగా ఆ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్డబ్ల్యూపీసీ లేని గ్రామ పంచాయతీల్లో వాటిని ఏర్పాటు చేయాలన్నారు. గ్రీన్ అంబాసిడర్లకు, గ్రీన్ గార్డులకు డబ్బులు పూర్తిగా చెల్లించాలని ఆదేశించారు. షెడ్లలో చెత్త సేకరణ వాహనాలు, వర్మీ బెడ్డింగ్, ఉత్పత్తి, అమ్మకాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. సచివాలయాల అంశాలకు సంబంధించి మన మిత్ర క్యాంపెయిన్లో హౌస్హోల్డ్ పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని సూచించారు.
రేపటి నుంచి జీవాలకు టీకాలు
అనంతపురం అగ్రికల్చర్: గొర్రెలు, మేకలకు గురువారం నుంచి ఉచితంగా టీకాలు (వ్యాక్సినేషన్) వేసే కార్యక్రమం మొదలవుతుందని పశుసంవర్ధక శాఖ రెండు జిల్లాల జేడీలు డాక్టర్ జీపీ వెంకటస్వామి, డాక్టర్ జి.శుభదాస్, పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (ఏడీ డీఎల్) ఏడీ డాక్టర్ రవిబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.నట్టలు(డీవార్మింగ్), నీలినాలుక వ్యాధి (బ్లూటంగ్), థైలేరియాసీస్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 49 లక్షలు గొర్రెలు, 9 లక్షల మేకలు... మొత్తంగా 58 లక్షల జీవాలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆర్ఎస్కేల వేదికగా శిబిరాలు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ చేపట్టడానికి పారాస్టాప్తో బృందాలు ఏర్పాటు చేశామన్నారు. మూడు వ్యాధులకు సంబంధించి అవసరమైన మందులు ఇప్పటికే పశువుల ఆస్పత్రులకు చేర్చామన్నారు. జులై 10 వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.
వక్ఫ్ భూములకు కౌలు వేలం
అనంతపురం రూరల్: వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూముల సాగుకు కౌలు వేలం నిర్వహించనున్నారు.ఈ మేరకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రామసుబ్బారెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గుంతకల్లులోని హజరత్సయ్యద్, అక్బర్ ఉర్ఫ్ మస్తాన్వలి దర్గాలకు చెందిన సర్వే నంబర్ 132–ఏలో 7.34 ఎకరాలు, సర్వే నంబర్ 132–సీలో 28.74 ఎకరాలతో పాటు, బొమ్మనహాళ్ మండలం గోవిందవాడలోని సర్వే నంబర్ 209లోని 25.30 ఎకరాలను కౌలుకు సాగు చేసేందుకు ఆసక్తి ఉన్న వారు ఈ నెల 28న జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలో నిర్వహించే వేలం పాటలో పాల్గొనవచ్చు. వేలం పాటలో పాల్గొనే వారు ముందుగా రూ.10 వేల ధరావత్తును చెల్లించాలి. పూర్తి వివరాలకు 99666 47586లో సంప్రదించవచ్చు.