
హవ్వ.. ఇదేం లైనింగ్!
కూడేరు: జిల్లా రైతాంగం వద్దు బాబోయ్ అని మొత్తుకుంటున్నా చంద్రబాబు సర్కారు హంద్రీ–నీవా లైనింగ్ పనులకు శ్రీకారం చుట్టింది. తమ అనుయాయ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల వినతులను సైతం పక్కకు పెట్టేసింది. పోనీ.. లైనింగ్ పనులనైనా సరిగా చేపడుతున్నారా.. అంటే అదీ లేదు. తూతూమంత్రంగా అక్కడి మట్టిని ఇక్కడ వేస్తూ నాసిరకంగా పనులు చేస్తున్నారు. కాంట్రాక్టర్ల ఘన కార్యంతో రైతులే కాకుండా సాధారణ ప్రజలు కూడా భవిష్యత్తులో ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కూడేరు మండలంలో చేపడుతున్న లైనింగ్ పనులను చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది.
ఇష్టం వచ్చినట్లుగా..
హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులను కాంట్రాక్టర్లు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా చేపడుతున్నారు. బయట నుంచి ఎర్రమట్టి తెచ్చి లైనింగ్ చేయాల్సి ఉన్నా.. కాంట్రాక్టర్లు ఏకంగా కాలువ గట్టు మట్టినే జేసీబీతో తవ్వి పనులు చేస్తున్నారు. కూడేరు మండల పరిధిలోని తిమ్మాపురం పై భాగాన హంద్రీ–నీవా కాలువ 235.500 కి.మీ వద్ద ఇలా జరుగుతోంది. కాలువ గట్టు పైభాగాన ఓబిరెడ్డి కుంట ఉంది. వర్షం వస్తే ఎంఎంహళ్లి, పి.నారాయణపురం గ్రామాల వంకల ద్వారా నీరు వచ్చి ఈ కుంటలో చేరుతుంది. 2015–17 మధ్య కాలంలో కాలువ గట్టు కోతకు గురికాకుండా రాతి కట్టడం కట్టి, మధ్యలో నల్లమట్టి వేసి ఇరువైపులా ఎర్రమట్టి వేశారు. ప్రస్తుతం కాంట్రాక్టర్లు ఆ కాలువ గట్టు మట్టినే జేసీబీతో తవ్వి హంద్రీ–నీవా లైనింగ్ చేస్తున్నారు. దీంతో కాలువ గట్టుకు గుంతలు ఏర్పడ్డాయి. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఓబిరెడ్డి కుంట నుంచి వచ్చే నీటి ప్రవాహానికి కాలువ గట్టు దెబ్బతినే ప్రమాదముంది. అలా జరిగితే హంద్రీ–నీవా గుండా ప్రవహించే నీరు దిగువన ఉన్న తిమ్మాపురం గ్రామాన్ని ముంచెత్తే ప్రమాదముంది. ఉన్నతాధికారులైనా స్పందించి గట్టు మట్టిని తవ్వకుండా బయట నుంచి మట్టి తెచ్చేలా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ఇష్టారాజ్యంగా హంద్రీ–నీవా లైనింగ్ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు
పట్టించుకోని అధికారులు
మండిపడుతున్న ప్రజలు
పర్యవేక్షణ లేకపోవడంతోనే..
అధికారులు సక్రమంగా పర్యవేక్షణ చేయకపోవడంతోనే కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు చేస్తున్నారు. ఎక్కడైనా కాలువ గట్టు దెబ్బతిని ఉంటే మట్టితో బాగు చేయాలి. కానీ కాంట్రాక్టర్లు గట్టుకు గుంతలు పెడితే భద్రత ఎలా ఉంటుంది? కాలువ పై భాగాన ఓబిరెడ్డి కుంట ఉంది. అందులోకి వర్షం నీరు పెద్ద ఎత్తున చేరి కాలువ వైపు ప్రవహిస్తుంది. జేసీబీతో గుంతలు పెట్టడంతో కాలువ గట్టు భవిష్యత్తులో కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. నీరు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి ప్రవేశిస్తే రైతులు నష్ట పోవాల్సి వస్తుంది.
– మేరీ నిర్మలమ్మ, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు, కూడేరు మండలం
కాంట్రాక్టర్ల లబ్ధికే పనులు
అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చేందుకే లైనింగ్ పనులు చేస్తున్నట్లుగా ఉంది. పనులను నాణ్యతగా చేయకపోగా ఉన్న కాలువ గట్టును పాడు చేయడం అన్యాయం. బయట నుంచి మట్టి తెచ్చి లైనింగ్ పనులు చేయాలి. నాసిరకంగా పనులు చేసుకొని పోతే భవిష్యత్లో కాలువ గట్లు తెగి పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు దెబ్బతింటాయి. లైనింగ్ పనులతో భూగర్భ జలాలు అడుగంటి రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు.
– రాయుడు, జిల్లా కోశాధికారి,
అఖిల భారత రైతు కూలీ సంఘం

హవ్వ.. ఇదేం లైనింగ్!

హవ్వ.. ఇదేం లైనింగ్!

హవ్వ.. ఇదేం లైనింగ్!

హవ్వ.. ఇదేం లైనింగ్!