
న్యాక్ దక్కేనా! ప్రతిష్ట నిలిచేనా?
●నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ పరీక్షకు సిద్ధమైన ఎస్కేయూ
న్యాక్ పాయింట్లు పొందేందుకు మౌలిక సదుపాయాల కల్పన ప్రధానం. గత ప్రభుత్వం హయాంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్లోని లా విభాగం నుంచి క్యాంటీన్, పూలే భవనం, కామెన్ మెస్ హాల్ వరకూ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇందు కోసం రూ.2.31 కోట్లు వెచ్చించారు. ఐఎస్ఓ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండరైజేషన్) గుర్తింపు తీసుకొచ్చారు. క్వాలిటీ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్, గ్రీన్ ఆడిట్ విభాగాల్లో ఐఎస్ఓ గుర్తింపు వచ్చింది. ఐఎస్ఓ గుర్తింపుతో న్యాక్లో పాయింట్లు పెరగనున్నాయి.
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం న్యాక్ (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) పరీక్షకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే న్యాక్ గుర్తింపునకు దరఖాస్తు చేసిన నేపథ్యంలో మెరుగైన పాయింట్లను సాధించే దిశగా వర్సిటీ ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారు. న్యాక్లో గణనీయమైన గ్రేడింగ్ వస్తే పీఎంఉషా (ప్రధాన మంత్రి ఉచ్ఛతార్ శిక్షా అభియాన్) పథకం కింద ఇబ్బడి ముబ్బడిగా నిధులు రానున్నాయి. ఏ ప్లస్, ఏ గ్రేడ్ వస్తే రూ.40 కోట్ల నిధులు మంజూరవుతాయి. ఐదు సంవత్సరాల కాలానికి ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు దోహదపడతాయి.
సెల్ఫ్ స్టడీ నివేదికే ప్రామాణికం
ఎస్ఎస్ఆర్ (సెల్ఫ్ స్టడీ రిపోర్ట్)లో పేర్కొన్న అంశాలను ప్రధానంగా న్యాక్ పీర్ కమిటీ పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో ఎస్ఎస్ఆర్లో పేర్కొన్న అంశాల ప్రాధాన్యత వివరాల సేకరణలో అధికారులు తలమునకలయ్యారు. 2017–18, 2018–19, 2019–20, 2020–21, 2021–22 విద్యా సంవత్సరాల్లో ఆయా విభాగాల్లో సాధించిన ప్రగతి, కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల వివరాలు, వారికి దక్కిన ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్మెంట్ వివరాలు, ఉపకార వేతనాలు, క్యాంపస్లో సౌకర్యాలు, హాస్టల్, ఆస్పత్రి సౌకర్యం, యాంటిర్యాగింగ్ కమిటీ, బొటానికల్ గార్డెన్, హరితవనం తదితర అంశాలను ఎస్ఎస్ఆర్లో పొందుపరుస్తున్నారు. అలాగే రూసా, డీఎస్టీ, డీబీటీ నుంచి పొందిన నిధుల వివరాలు, ప్రాజెక్ట్ వివరాలను నమోదు చేస్తున్నారు.
వేధిస్తున్న ప్రతికూల అంశాలు
ఎస్కేయూ క్యాంపస్ కళాశాలలో మొత్తం 268 మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉండాల్సి ఉండగా, కేవలం 45 మంది మాత్రమే పనిచేస్తున్నారు. టీచింగ్ అసిస్టెంట్లు, అకడమిక్ కన్సెల్టెంట్లతోనే ఇప్పటి వరకూ నెట్టుకొస్తున్నారు. హిస్టరీ, హిందీ, అడల్ట్ ఎడ్యుకేషన్, పాలిమర్ సైన్సెస్ విభాగాల్లో రెగ్యులర్ బోధనా సిబ్బంది ఒక్కరూ కూడా లేరు. ఇంగ్లిష్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్సెస్, లా కోర్సులకు సంబంధించి ఒక్కొక్క ప్రొఫెసర్ మాత్రమే ఉన్నారు. కెమిస్ట్రీ, కామర్స్, మేథమేటిక్స్, బొటనీ, సెరికల్చర్, బయో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, తదితర విభాగాల్లో అధ్యాపకుల కొరత నెలకొంది. న్యాక్ గుర్తింపులో అధ్యాపకుల అంశానికి సంబంధించి 200 మార్కులు ఉంటాయి. దీంతో ఈ అంశం కాస్త న్యాక్ గ్రేడింగ్లో ప్రతికూలంగా చూపే అవకాశం ఉంది. ఈ మార్కులు సాధించాలంటే కనీసం టీచింగ్ అసిస్టెంట్ల నియామకమయినా పూర్తి స్థాయిలో చేయాల్సి ఉంటుంది. మరో వైపు పీజీ కోర్సుల్లో ఏటా ప్రవేశాలు తగ్గుతూ వస్తున్నాయి. అన్ని కోర్సుల్లో కలిపి 1,100 సీట్లు ఉండగా, ఈ ఏడాది 369 మంది మాత్రమే అడ్మిషన్లు పొందారు. తెలుగు విభాగంలో కేవలం ముగ్గురు మాత్రమే అడ్మిషన్ పొందారు.
అనుకూలం కానున్న
గత ప్రభుత్వ చర్యలు
మెరుగైన గ్రేడింగ్ సాధించేలా కృషి
నాణ్యమైన పరిశోధనలను ప్రోత్సహిస్తున్నాం. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో గణనీయమైన ప్రగతి సాధించాం. అనుబంధ కళాశాలల్లోనూ గణనీయమైన పురోగతి ఉంది. న్యాక్లో మెరుగైన గ్రేడింగ్ సాధించేందుకు కృషి చేస్తాం.
– ఆచార్య బి.అనిత,
ఇన్చార్జి వీసీ, ఎస్కేయూ

న్యాక్ దక్కేనా! ప్రతిష్ట నిలిచేనా?