అనకాపల్లి: నర్సీపట్నం, అనకాపల్లి డిపోల్లో అన్ని ఓటీ సర్వీసులను రెస్టాఫ్గా మార్చి ప్రయాణికులకు బస్సు సౌకర్యం మెరుగుపరచాలని నేషనల్ మజ్ధూర్ యూనిటీ అసోసియేషన్ రీజనల్ కార్యదర్శి పి.సుధాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక డిపో వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ సర్క్యులర్ 1/2019కు విరుద్ధంగా విధుల నుంచి తొలగించిన డ్రైవర్ ఇ.రమణను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, నర్సీపట్నం–విశాఖ నైట్ సర్వీసులకు డ్యూటీ అవర్స్ తగ్గించాలని, స్టాఫ్ రెస్ట్రూమ్ సౌకర్యం మెరుగుపరచాలన్నారు. అర్హులైన మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్లు ఇవ్వాలని, ఉద్యోగులకు లీవు పొజీషన్ మెరుగుపరచాలని, గ్యారేజీలో కార్మికులకు నాణ్యమైన టూల్స్, సరిపడా స్పేర్పార్ట్స్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి జి.శంకరరావు, రీజనల్ అధ్యక్షుడు రాజు, తదితరులు పాల్గొన్నారు.


