యలమంచిలి రూరల్: లక్కబొమ్మల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతి నార్జించిన మండలంలోని ఏటికొప్పాక గ్రామాన్ని పర్యాటకంగా అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ అన్నారు. ఏటికొప్పాక గ్రామానికి సమీపంలో రూ.3 కోట్ల రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ నిధులతో నిర్మించనున్న హస్తకళ ఇతివృత్త ఉద్యానవనం (హ్యాండీక్రాఫ్ట్స్ థీమ్డ్ పార్కు) నిర్మాణానికి ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శుక్రవారం భూమిపూజ చేశారు. ఏటికొప్పాక సమీపంలో సుమారు 10 ఎకరాల్లో ఈ పార్కు నిర్మాణానికి పర్యాటకశాఖ ప్రణాళిక రూపొందించింది. పార్కు నమూనాతో ముద్రించిన ఫ్లెక్సీని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్న ఏటికొప్పాక హస్తకళాకారులు, లక్కబొమ్మలకు మరింత ప్రాచుర్యం కల్పించి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. లక్కబొమ్మల తయారీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పర్యాటకశాఖ డైరెక్టర్ రవి పట్టాన్శెట్టి, కలెక్టర్ విజయకృష్ణన్, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
హ్యాండీక్రాఫ్ట్స్ థీమ్డ్ పార్కుకు భూమిపూజ


