రావికమతం: చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు పల్లెపండుగ–అడవితల్లి బాట పేరిట ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు పనులకు గిరిజనులే శ్రమదానం చేసి బాగు చేసుకున్నారు. చీమలపాడు పంచాయతీ శివారు కొండ శిఖర గ్రామం నేరేడు బంద పీవీటీజీ కొండ గిరిజనులు జెడ్.జోగుంపేట నుంచి మూడు కిలోమీటర్ల మేర శుక్రవారం రోడ్డు అభివృద్ధి చేశారు. జోగుంపేట నుంచి నేరేడుబంద వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.2.50 కోట్ల నిధులతో పల్లెపండుగ–అడవితల్లి బాట కార్యక్రమం పేరిట 2024 డిసెంబరులో చోడవరం ఎమ్మెల్యే ప్రారంభించారు. కొంత మేరకు రోడ్డు పనులు ప్రారంభించి మధ్యలో వదిలేశారు. అనంతరం వేసిన మట్టి కొట్టుకుపోయి గోతులమయంగా మారింది. దీంతో ఈ మార్గంలో వెళ్లాలంటే గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో నేరేడు బంద గిరిజన యువకులు, మహిళలు తమ గ్రామానికి బైక్ వెళ్లడానికి వీలుగా శ్రమదానం చేసి మూడు కిలోమీటర్లు వరకు గోతులను పూడ్చి రోడ్డు చదును వేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు కే గోవిందరావు మాట్లాడుతూ ప్రభుత్వం తవ్వి వదిలేసిన రోడ్డు పనులు పూర్తి చేయాలని, లేకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద వినూత్నంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు.


