నర్సీపట్నం : ఆటోలో తరలిస్తున్న రూ.1.83 కోట్ల విలువైన లిక్విడ్ గంజాయిని గొలుగొండ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. గంజాయి తరలిస్తూ పట్టుబడిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. మీడియాతో డీఎస్పీ మాట్లాడుతూ ఒడిశా నుంచి అల్లూరి జిల్లా మీదుగా మైదాన ప్రాంతానికి గంజాయి తరలిస్తున్నట్టు ఈగల్ ఇంటెలిజెన్స్ వారు జిల్లా ఎస్పీ తుహిన్సిన్హాకు వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బంది అప్రమత్తయ్యారని తెలిపారు. రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, ఎస్ఐలు రామారావు, రుషికేశ్వరరావు, రాజారావు సిబ్బందితో గొలుగొండ మండలం, చిన్నయ్యపాలెం శివారు ప్రాంతంలో నిఘా పెట్టారన్నారు. అటుగా వస్తున్న ఆటో, రెండు బైకులు ఆపి తనిఖీ చేశారు. ఆటోలో 14.7 కేజీల హషీస్ ఆయిల్(లిక్విడ్) గంజాయిని గుర్తించారు. పట్టుబడిన నిందితుల్లో గొలుగొండ మండలం, కొమిర పంచాయతీకి చెందిన రెడ్డి నర్సింహమూర్తిపై 7 కేసులు, 3 దొంగతనం కేసులు ఉన్నాయి. విశాఖపట్నం అగనంపూడికి చెందిన అంకిరెడ్డి నానాజీ(37)పై 8 గంజాయి కేసులు ఉన్నాయి. అల్లూరి జిల్లా, చింతపల్లి మండలం, బలపం గ్రామానికి చెందిన కొర్రా వెంకటరావు(38)పై 3 గంజాయి కేసులు ఉన్నాయి. విశాఖపట్నం, అక్కయ్యపాలేనికి (స్వస్థలం రోలుగుంట మండలం, బి.బి.పట్నం) చెందిన బాకురి లోవ లక్ష్మిపై 3 గంజాయి కేసులు ఉన్నాయి. అలాగే మరో నిందితుడు మల్కన్గిరి జిల్లా, చిత్రకొండ బ్లాక్, రోళ్లగెడ్డ గ్రామానికి చెందిన కొర్రా సాయి(22). వీరందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఆటోడ్రైవర్ పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన నిందితుల వద్ద నుంచి ఆటో, రెండు బైక్లు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. లిక్విడ్ గంజాయి చైన్నె తరలిస్టున్నట్టు తమ విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు.


