నక్కపల్లి : మండలంలో పోలవరం కాలువ మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలపై బహిరంగ విచారణకు సిద్ధంగా ఉండాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ కూటమి నాయకులకు సవాల్ విసిరారు. మంగళవారం నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ పోలవరం కాలువ మట్టిని కూటమి పార్టీలకు చెందిన నాయకులే తవ్వి తరలించుకుపోతున్నారన్నారు. ఇది బహిరంగ వ్యవహారమే అయినప్పటికీ తమ ప్రమేయం లేదంటూ కొంతమంది నాయకులు భుజాలు తడుముకోవడం సిగ్గుచేటన్నారు. రమణయ్యపేట, ముకుందరాజుపేట, తాండవ చక్కెర కర్మాగారం పరిసర ప్రాంతాల నుంచి నిత్యం లక్షలాది క్యూబిక్మీటర్ల పోలవరం కాలువ మట్టిని అక్రమంగా తవ్వేసి అనధికార లేఅవుట్లకు అమ్మేసుకుంటున్నారన్నారు. గుల్లిపాడు రైల్వేప్లాట్ఫారం ఎత్తు చేయడానికి ముకుందరాజుపేట నుంచి పోలవరం కాలువ మట్టి తరలించారన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు చెరువుల్లో మట్టిని గంపగుత్తగా అమ్మేస్తున్నారన్నారు. పోలవరం మట్టి తవ్వకాలపై టీడీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.
వాటర్ట్యాంకు కూలిపోవడం సిగ్గుచేటు
బోదిగల్లం పునరావాసకాలనీలో నిర్మాణంలో ఉన్న వాటర్ట్యాంకు కూలిపోవడం సిగ్గుచేటని, కాంట్రాక్టర్ ఎవరో కూడా తెలియని దుస్థితిలో టీడీపీ నాయకులు ఉండడం దారుణమన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్లే ట్యాంకు నిర్మాణ దశలో కూలిపోయి ఇద్దరు గాయాలపాలయ్యారన్నారు. సుమారు 20 మంది ప్రాణాలతో బయటపడ్డారన్నారు. వాటర్ట్యాంకు కూలిపోయిన ఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గొర్ల గోవిందు, తళ్ల భార్గవ్, అల్లాడ కొండ పాల్గొన్నారు.


