జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై, నల్లబజారులో విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం, పౌర సరఫరాల శాఖ అధికారులు పెట్రోల్ బంకుల వద్ద నిల్వలను నిశితంగా గమనిస్తున్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, సంబంధిత శాఖల అధికారులతో కలిసి పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితులపై డీలర్లు, అసోసియేషన్ ప్రతినిధులు, బంక్ యజమానులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిలాల్లోని అన్ని పెట్రోల్ బంకుల్లో తగినంత నిల్వలు ఉన్నాయని, సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు అనవసరంగా భయపడకుండా, అపోహలు నమ్మకుండా సాధారణంగా ఇంధనం వినియోగించాలని సూచించారు. ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ఎలాంటి జాప్యం లేకుండా ఆయిల్ ట్యాంకర్లు చేరుకునే విధంగా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


