కశింకోట: డిజిల్ కొరతతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మండలంలో జాతీయ రహదారి పొడవునా కంపెనీ ఔట్ లెట్లతోపాటు ప్రైవేటు బంకులు పదికి పైగా ఉన్నాయి. పెట్రోల్కు ప్రస్తుతానికి ఇబ్బంది లేకపోయినా డీజిల్కు కొరత ఏర్పడింది. దీంతో లారీకి 50 లీటర్లు, కార్లు, వ్యాన్లకు రూ.2 వేలు విలువైన డీజిల్ను మాత్రమే వేస్తున్నారు. దానికి కూడా గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని వాహన చోదకులు వాపోతున్నారు. రాజమహేంద్రవరం నుంచి విశాఖకు రావాలంటే ఐదు గంటల సమయం పడుతుందని, అలాంటిది ఆయిల్ కొరత వల్ల, దాని కోసం మూడు బంకుల్లో నిరీక్షించడంతో పది గంటల వరకు సమయం పట్టిందని ఓ లారీ డ్రైవర్ ఆందోళన వ్యక్తం చేశారు.నెట్ సరిగా పని చేయక బిల్లుల చెల్లింపునకు ఇబ్బంది పడాల్సి వస్తోందని చెప్పారు. డిజిల్ ఆయిల్ కొరత నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


