మహారాణిపేట: రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ విశాఖ పర్యటన షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా నిర్ణయించినట్లు ఆదివారం రాత్రి కాకుండా, సోమవారం ఉదయం 9 గంటలకు ఆయన విశాఖ చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు ఐఎన్ఎస్ డేగాలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు స్వాగతం పలికిన అనంతరం హోటల్కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 3.20 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో జరగనున్న ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో గవర్నర్ పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి ఐఎన్ఎస్ డేగాకు వెళ్లి ఉపరాష్ట్రపతికి వీడ్కోలు పలికి నొవోటెల్ హోటల్లో బస చేస్తారు. మంగళవారం సాయంత్రం గవర్నర్ విజయవాడకు బయలుదేరుతారు.
విశాఖ పోర్టు
మరో అరుదైన రికార్డు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) మరో అరుదైన రికార్డు నమోదు చేసింది. అత్యంత భారీ పరిమాణం కలిగిన ‘ఎంవీ రెజీనా ఓల్డెన్డార్ఫ్’ అనే కార్గో నౌకను ఆదివారం విజయవంతంగా హ్యాండ్లింగ్ చేసింది. 260 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పు, 14.70 మీటర్ల డ్రాఫ్ట్ కలిగిన ఈ భారీ నౌక.. ఇప్పటివరకు ఇన్నర్ హార్బర్కు వచ్చిన నౌకలన్నింటిలోనూ అతి పెద్దదిగా నిలిచింది. ఇది దక్షిణాఫ్రికాలోని రిచర్డ్స్ బే పోర్టు నుంచి స్టీమ్ కోల్తో చేరుకుంది. ఈస్ట్ క్వే–1 బెర్త్లో 1,15, 873 టన్నుల స్టీమ్ కోల్ని పోర్టు సిబ్బంది హ్యాండ్లింగ్ చేశారు. సముద్రయాన రంగంలో తనదైన ముద్ర వేస్తూ, అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడంలో వీపీఏ మరో మెట్టు ఎదిగిందని పోర్టు చైర్మన్ డా.అంగముత్తు అన్నారు.


