నర్సీపట్నం : ఇద్దరు బైక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ గపూర్ కథనం ప్రకారం వివరాలివి. వరుస చోరీల నేపథ్యంలో ఎస్ఐలు రమేష్, ఉమామహేశ్వరరావు, కానిస్టేబుళ్లు నరేంద్ర, సతీష్, నానితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు. ఈ బృందం నక్కపల్లి మండలం, సారపల్లిపాలెం గ్రామానికి చెందిన అనుమాను శ్రీను చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించింది. శ్రీనుపై నిఘా పెట్టిన పోలీసులు శుక్రవారం చోరీ బైక్తో వెళ్తుండగా నర్సీపట్నం పెద్ద చెరువు సమీపంలో పట్టుకున్నారు. శ్రీనుకు పట్టణంలో పెదబొడ్డేపల్లికి చెందిన మైనర్ బాలుడు చోరీలకు సహకరిస్తున్నాడు. వీరు నర్సీపట్నంతో పాటు చింతపల్లి, కాకినాడ జిల్లాల్లో బిక్కవోలు, వంటిమామిడి పోలీసుస్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడ్డారు. ఈ చోరీలకు సంబంధించి అనకాపల్లి, కాకినాడ జిల్లాలో ఆయా పోలీసు స్టేషన్లలో ఇది వరకే కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి మొత్తం ఎనిమిది ద్విచక్రవాహనాలతో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సంబంధిత యజమానులకు అందించనున్నట్టు సీఐ తెలిపారు. నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసి శ్రీనును జైలుకు, మైనర్ బాలుడిని జువైనల్ హోంకు తరలించినట్టు తెలిపారు.


