ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థులు
విశాఖ లీగల్ : విశాఖ న్యాయవాదుల సంఘం ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. మొత్తం 2,174 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది ఎ.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇందుకు ఆరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. సాయంత్రం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో తుది ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు. సీనియర్ న్యాయవాదులకు అసౌకర్యం లేకుండా వేదిక వద్ద రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కీలకమైన అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి పోస్టులకు నలుగురు చొప్పున పోటీలో ఉన్నారు. అభ్యర్థుల ప్రచారంతో కోర్టు ప్రాంగణం కోలాహాలంగా మారింది. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు న్యాయవాదుల సంఘం కార్యదర్శి ఎల్.పార్వతీశ్వర నాయుడు తెలిపారు.


