ఈ పునర్నిర్మాణ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణగా భారీ ఎయిర్ కాన్కోర్స్ నిలవనుంది. 72 మీటర్ల వెడల్పు, 220 మీటర్ల పొడవుతో దీనిని నిర్మిస్తున్నారు. స్టేషన్ ప్లాట్ఫాంల పైభాగంలో, సహజ సిద్ధమైన కాంతి ప్రసరించేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఇది స్టేషన్కు రెండు వైపులా ఉన్న ప్లాట్ఫాంలను అనుసంధానిస్తుంది. ఇక్కడ 600 మంది ప్రయాణికులు కూర్చునే వీలుండటంతో పాటు 20 వాణిజ్య దుకాణాలు కూడా రాబోతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 60 లిఫ్ట్లు, 50 ఎస్కలేటర్లు, 28 ర్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు.
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోనే అత్యంత రద్దీగా ఉండే విశాఖపట్నం రైల్వేస్టేషన్ రూపురేఖలు మారిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టేషన్ పునర్నిర్మాణ ప్రాజెక్టు ఊపందుకుంది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల వైపు 60 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు రూ.1000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు ప్రయాణికులకు విమానాశ్రయ స్థాయి అనుభూతిని అందించడమే లక్ష్యంగా సాగుతున్నాయి. ప్రస్తుతం స్టేషన్ ఉత్తర, దక్షిణ దిశలైన జ్ఞానాపురం వైపు, అలాగే ప్రధాన ప్రవేశ ద్వారం భారీ ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గతంలో ప్రధాన కార్యాలయం, రిజర్వేషన్ కౌంటర్లు, వెయిటింగ్ హాళ్లు ఉన్న భవనాల స్థానంలో బహుళ అంతస్తుల అత్యాధునిక నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఒక్కోటి 5 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంతో రెండు ప్రధాన భవనాలను నిర్మిస్తున్నారు. ప్రారంభంలో పనులు కొంత ఆలస్యమైనప్పటికీ.. ప్రస్తుతం మాత్రం వేగంగా పుంజుకున్నాయి. అసలు ఎటువైపు ఏం అభివృద్ధి జరుగుతోందో ఓసారి పరిశీలిద్దాం..
చురుగ్గా విశాఖపట్నం రైల్వే స్టేషన్ విస్తరణ
ప్రస్తుతం ఉన్న 8 ప్లాట్ఫాంలను 14కు పెంచేలా పనులు
టెర్మినల్స్ మాదిరిగా ఫ్లాట్ఫాంల నిర్మాణం
ఎర్రి గెడ్డ మురుగు కాలువ దారి మళ్లింపు.. 1.50లక్షల చదరపు అడుగుల పార్కింగ్
60కి పైగా లిఫ్ట్లు, 50 వరకు ఎస్కలేటర్ల ఏర్పాటు


