జిల్లాలో 644 పంచాయతీలు పురుషుల కన్నా మహిళలు అధికం మహిళా ఓటర్లు 6,32,785, పురుష ఓటర్లు 6,02,281 అనకాపల్లిలో అత్యధికం, యలమంచిలి మండలంలో అత్యల్పం ఓటర్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ
సాక్షి, అనకాపల్లి : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఓటర్లలో మహిళలదే పైచేయిగా ఉంది. రానున్న పంచాయతీ ఎన్నికల కోసం రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే పురుషుల కంటే సుమారు 35 వేల మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఓటరు జాబితాలను ఇటీవల గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించారు. వీటిల్లో అభ్యంతరాలు ఏమైనా ఉంటే నిర్ణీత గడువులోగా సంబంధిత పంచాయతీల కార్యదర్శులకు లిఖత రూపంలో అందజేయాల్సి వుంటుంది. జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు 24 మండలాల పరిధిలో ప్రస్తుతం 646 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 12,35,083 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 6,32,785 మంది మహిళలు, 6,02,281 మంది పురుషులు ఉన్నారు. మిగిలిన వారు ఇతరులు. మొత్తం మీద పురుషుల కంటే మహిళా ఓటర్లు 30,504 అధికంగా వుండడం విశేషం.
నిర్ణేతలు మహిళలే!
జిల్లాలోని గ్రామ పంచాయతీలకు సంబంధించిన నూతన ఓటర్ల జాబితాను జిల్లా యంత్రాంగం ప్రచురించింది. జాబితాలను పంచాయతీ కేంద్రాలు, సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. గ్రామ పంచాయతీలు, వార్డుల్లో ఓటర్ల సంఖ్యను సూచించారు. ఈ ఓటర్ల జాబితా మేరకు జిల్లాలో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు 24 మండలాలు, 644 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 6282 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలోని ఓటర్లు 12,35,083 మంది. వీరిలో అత్యధికంగా మహిళలే ఉన్నారు. వీరిలో 6,32,785 మంది మహిళలు, 6,02,281 మంది పురుషులు ఉన్నారు. మొత్తం మీద పురుషుల కంటే మహిళా ఓటర్లు 30,504 మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. అత్యధికంగా అనకాపల్లి మండలంలో 81,568 మంది ఓటర్లు ఉండగా..వారిలో మహిళలు 42,138 మంది ఉండగా..39,434 మంది పురుష ఓటర్లు ఉన్నారు. తర్వాత పాయకరావుపేట మండలంలో 79,851 మంది ఓటర్లు ఉండగా అందులో 40,174 మంది మహిళలు, 39,674 మంది పురుషులు ఉన్నారు. యలమంచిలి మండలంలో అత్యల్పంగా 20,422 మందికి గానూ 9,819 మంది పురుషులు, 10,603 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
22 మండలాల్లో ఆధిక్యం..
రెండు మండలాల్లో(గొలుగొండ, చీడికాడ) పురుషులు అధికంగా ఉన్నారు. మిగతా 22 మండలాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు సంబంధించి విడుదల చేసిన ఓటర్ల జాబితాలోనూ వారిదే పైచేయి. ఈ ఓటరు జాబితాను బట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో అతివలకు ప్రాధాన్యం దక్కే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మహిళలు రాజకీయ పార్టీల నుంచి అధిక వాటాను దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.


