అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు స్థానిక గవరపాలెం కొత్త అమావాస్య నెల జాతరలో భాగంగా నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కొంతమంది భక్తులు అమ్మవారి ఆలయ సమీపంలో వంటలు చేసి, నైవెద్యంగా సమర్పించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆలయంలో క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు భక్తులకు ఉచితంగా ప్రసాదం, తాగునీరు, మజ్జిగ, చిన్నారులకు పాలు పంపిణీ చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ చర్యలు తీసుకున్నారు. పట్టణ, ట్రాఫిక్ సీఐలు ప్రేమ్కుమార్, ఎం.వెంకటనారాయణలు ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.


