కళ్ల ముందే భార్య దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

కళ్ల ముందే భార్య దుర్మరణం

Apr 13 2026 7:32 AM | Updated on Apr 13 2026 7:32 AM

గుర్తుతెలియని వాహనం ఢీ

భర్త, పిల్లలకు గాయాలు

నక్కపల్లిలో ఘటన

నక్కపల్లి: జాతీయ రహదారిపై నక్కపల్లి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వివాహిత దుర్మరణం చెందింది. ఆమె భర్త, పిల్లలకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హెటిరో కంపెనీలో పని చేస్తున్న సీతా సురేష్‌ తన భార్యా పిల్లలను తీసుకుని మోటారు సైకిల్‌పై అడ్డురోడ్డు నుంచి నక్కపల్లి ఆస్పత్రికి వస్తుండగా, సారిపల్లె పాలెం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో సురేష్‌ భార్య షారోన్‌ రేఖ (38) అక్కడికక్కడే మృతి చెందింది. సురేష్‌తోపాటు అతని ఇద్దరు పిల్లలు సవ్యశ్రీ, రోషన్‌లకు గాయాలయ్యాయి. వీరిని స్థానికులు నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లి విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి పిల్లలు బిక్కమొహం వేసి ఏమైందో తెలియక అమాయకంగా చూడటం స్థానికులను కంటతడి పెట్టించింది. కళ్లముందే కట్టుకున్న భార్య మృత్యువాత పడటాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు పిల్లలు అమ్మ ఏది నాన్న అంటే ఏం సమాధానం చెప్పాలంటూ సురేష్‌ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. పొట్టకూటి కోసం విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చి హెటిరోలో పనిచేస్తూ బతుకుతున్న సురేష్‌ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం ఛిన్నాభిన్నం చేసింది. మృతదేహం ముందు భర్త అభం శుభం తెలియని ఇద్దరు బిడ్డలు రోదిస్తున్న తీరు స్థానికులను కంట తడి పెట్టించింది. నాన్న అమ్మకి ఏమైంది అంటూ వారు తండ్రిని అడుగుతుంటే సమాధానం చెప్పలేక సురేష్‌ పిల్లలని పట్టుకుని బోరున విలపించాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సన్నిబాబు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement