యలమంచిలి రూరల్: పట్టణంలోని అల్లూరి సీతారామరాజు కాలనీకి చెందిన ఫైనాన్స్ వ్యాపారి రాయి దుర్గా నాగ వెంకట సతీష్(42) ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానిక మామిడి అపార్ట్మెంట్లో 303వ నంబరు ఫ్లాట్లో ఓ మహిళ వద్దకు తరచుగా వచ్చి వెళ్తున్న సతీష్ మృతిపై అనుమానం ఉన్నట్టు అతని భార్య రాయి భార్గవి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్ఐ కె.సావిత్రి తెలిపారు.దర్యాప్తులో భాగంగా యలమంచిలి సీఐ ధనుంజయరావు,పట్టణ ఎస్ఐ సావిత్రి,సిబ్బంది సతీష్ మృతి చెందిన ఫ్లాట్కు వెళ్లి పరిశీలించారు.క్లూస్ టీం బృందం సభ్యులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు.సతీష్ ఇటీవల పచ్చకామెర్ల బారిన పడి చికిత్స తీసుకున్నట్టు,బాగా మద్యం సేవించే అలవాటు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.ఆదివారం రాత్రి అస్వస్థతకు గురైనట్టు తెలుసుకున్న సతీష్ భార్య, కుటుంబసభ్యులు మామిడి అపార్టుమెంటుకు వెళ్లేసరికి హాలులో అపస్మారక స్థితిలో సతీష్ పడి ఉన్నట్టు గుర్తించారు. సతీష్ అనారోగ్యంతో మృతి చెందాడా లేక మరణానికి ఇతర కారణాలున్నాయా అన్నది తేలవలసి ఉంది. శవపంచనామా,పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు.


